లక్నో: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్పై కేసు నమోదైంది. ఈ నెల 22వ తేదీన మహోబా జిల్లా సమద్ నగర్లో కాంగ్రెస్ నేత బ్రిజ్రాజ్ అహిర్వార్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అజయ్ రాయ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దాదాపు 16 వాహనాల్లో, 30 మంది అనుచరులతో ఆ కార్యక్రమానికి తరలివచ్చిన అజయ్ రాకపోకలకు అంతరాయం కలిగించారని, ప్రధాని మోదీని దూషించారని, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ నీరజ్ రావత్ అనే బీజేపీ కార్యకర్త కొట్వాలీ నగర్ పోలీస్స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. దీనిపై అజయ్ రాయ్ స్పందిస్తూ..అది ఫేక్ వీడియో అని, తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని అంటున్నారు. ఫేక్ వీడియోను పోస్ట్ చేసిన వారిపై పోలీసులకు తాను కూడా ఫిర్యాదు చేస్తానన్నారు.


