ఆరుతడికే సాగునీరు
సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఈసారి యాసంగి సీజన్లో ఆరుతడి పంటలకే సాగునీరు అందించనున్నారు. వారాబందీ పద్ధతిలో నీటి సరఫరా చేపట్టనుండగా.. కనీసం 15 రోజులకు ఒకసారి విడుదల చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టుల్లో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద అత్యధికంగా 2,81,754 ఎకరాలకు ప్రస్తుత సీజన్లో సాగునీటిని అందించనున్నారు. అలాగే సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న పెండింగ్ పనుల కారణంగా ఈసారి ఆర్డీఎస్ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు అధికారులు క్రాప్ హాలిడే (పంట విరామం) ప్రకటించారు.
15 రోజుల వ్యవధిలో..
యాసంగి సీజన్కు సాగునీటి వనరులను పకడ్బందీగా వినియోగించడంపై నీటి పారుదల శాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. యాసంగిలో వేరుశనగ, మొక్కజొన్న తదితర ఆరుతడి పంటలకే సాగునీరు అందించనున్నారు. నీటి అవసరం ఎక్కువగా ఉండే వరి పంటకు ఈ సీజన్లో నీటి సరఫరా ఉండదు. వేసవిలో నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని పరిమిత స్థాయిలో సరఫరా చేస్తారు. ప్రధానంగా తాగునీటి అవసరాల మేరకు తగినంత నిల్వ ఉంచుతూనే వారాబందీ పద్ధతిలో ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఈ క్రమంలోనే కనీసం 15 రోజుల వ్యవధిలో ఒకసారి ఆరుతడి పంటలకు నీటి సరఫరా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అత్యధికంగా కేఎల్ఐ..
ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద ప్రస్తుతం 3,70,469 ఎకరాలు ఉండగా.. యాసంగి సీజన్లో 2,81,754 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఇందులో 2,01,317 ఎకరాల మేర ఆరుతడి పంటలతోపాటు మరో 80,437 ఎకరాలకు వరి సాగుకు నీటిని అందిస్తారు. అలాగే కోయిల్సాగర్ కింద 35,600 ఎకరాల ఆయకట్టు ఉంటే ఆరుతడి పంటలకు 7,700 ఎకరాలకే పరిమితం చేశారు. భీమా లిఫ్ట్–1 కింద 82,523 ఎకరాలు ఉండగా కేవలం ఆరుతడికి 21,690 ఎకరాల్లో నీరందిస్తారు. భీమా లిఫ్ట్–2 సైతం 92 వేల ఎకరాల ఆయకట్టుకు గాను 5,350 ఎకరాల్లో ఆరుతడి, 4,650 ఎకరాల్లో వరి పంటకు నీరందించనున్నారు. జూరాల ప్రాజెక్టు కింద మొత్తం 1,09,296 ఎకరాలకు గాను ఆరుతడి కింద 20,014 ఎకరాలకు, వరి 6,910 ఎకరాలకు సాగు నీరందించనున్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టు కింద 1.42 లక్షల ఎకరాలకు గాను ఆరుతడికి 22,800 ఎకరాల మేరకు సాగునీటి సరఫరా చేయనున్నారు. ఈ మేరకు రైతులు పంటలను సాగుచేసేలా అవగాహన కల్పించనున్నారు.
మరమ్మతుల నేపథ్యంలో..
ఆర్డీఎస్ కింద ఆయకట్టు రైతులకు క్రాప్ హాలిడే శాపంగా మారింది. ఆర్డీఎస్ హెడ్వర్క్స్ పెండింగ్ పనులు, మరమ్మతు కారణంగా ఆయకట్టు రైతులకు సాగునీటిని అందించలేమని అధికారులు క్రాప్ హాలిడే ప్రకటించారు. దీంతో 83,998 ఎకరాల ఆయకట్టు నీటి సరఫరా నోచుకోవడం లేదు. కనీసం వేరుశనగ, మొక్కజొన్న, కంది తదితర ఆరుతడి పంటలను సైతం సాగుచేసుకునే అవకాశం ఉండటం లేదు.
యాసంగి పంటలకు సాగునీటి ప్రణాళిక ఖరారు
వారబందీ పద్ధతిలో విడుదలకు నిర్ణయం
కనీసం 15 రోజులకు ఒకసారి వదిలేలా చర్యలు
ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా కేఎల్ఐ కింద 2.81 లక్షల ఎకరాలకు..
ఆర్డీఎస్ కింద పరిధిలో పంట విరామం ప్రకటన
ఆరుతడికే సాగునీరు


