
‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా చాటుదాం
నారాయణపేట రూరల్: రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో కమల వికాసమే లక్ష్యంగా పని చేద్దామని బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగురావునామాజీ అన్నారు. పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయలంలో జిల్లా నూతన అధ్యక్షులు సత్యాయాదవ్తో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు సంఘ్ పరివార్ ఏర్పాటకు కారకులైన శ్యాంప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్దయాల్, భరతమాత చిత్రపటాలకు పూజలు చేసి మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో అత్యధిక సభ్యత్వం కల్గిన ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా బీజేపీ ఆవిర్భవించిందన్నారు. మోదీ నేతృత్వంలో ఎన్నో హామీలను నెరవేర్చడమే కాకుండా ప్రకటన చేయని ఎన్నో కార్యక్రమాలు చేసి చూచించిన ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కిందన్నారు. ప్రపంచ దేశాలకే భారతావని ఒక చుక్కానిలా మారిందన్నారు. రాబోవుస్థానిక సంస్థల ఎన్నికల్లో కమలం గెలుపు ఎవరు అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో 15 రాష్ట్రాల్లో సొంతంగా, మరో ఐదు చోట్ల మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందన్నారు. జిల్లాలో తిరిగి పూర్వ వైభవం తీసుకుని వచ్చేందుకు గ్రామ స్థాయి కార్యకర్తలు సిద్దం కావాలన్నారు. కార్యక్రమంలో రఘురామయ్యగౌడ్, పట్టణ అధ్యక్షులు పోషల్ వినోద్, మండల అధ్యక్షురాలు జ్యోతి సాయిబన్న, రఘువీర్, వెంకటయ్య, రఘువీర్, కతలప్ప, కృష్ణ, సత్యరఘుపాల్, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
పల్లెపల్లెన బీజేపీ ఆవిర్భావ దినోత్సవం
కోస్గి: భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినాన్ని పురస్కరించుకొని ఆదివారం మండల కేంద్రంతోపాటు గ్రామాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేసి ప్రతి గడపకు పార్టీ అందించిన పథకం వివరించి గ్రామీణస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పలువురు నాయకులు ఈ సందర్భంగా సూచించారు. అనంతరం స్థానిక ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. ఇందులో పార్టీ మండల అధ్యక్షుడు పాలెం ప్రశాంత్, కోడంగల్ అసెంబ్లీ కో కన్వీనర్ రాము, జిల్లా కార్యవర్గ సభ్యుడు అంజయ్య, మాజీ మండల అధ్యక్షుడు సీబీ వెంకటేష్, పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్, పార్టీ నాయకులు, బీజేవైఎం నాయకులు బద్రీనాథ్, సంపల్లి శ్రీను, రమేష్, జైపాల్, శ్రీనివాస్, భాస్కర్ పాల్గొన్నారు.