నంద్యాల (న్యూటౌన్): స్వచ్ఛ జిల్లాలో ప్రతి పౌరుడు భాగస్వాములు కావాలని రాష్ట్ర న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం నంద్యాల పట్టణంలోని గాంధీచౌక్ మార్కెట్ బజార్ ప్రాంతంలో పారిశుద్ధ్య పనులను మంత్రి పరిశీలించారు. వ్యాపారులు రాత్రివేళల్లో దుకాణాల చెత్తను రోడ్లపై, డ్రైనేజీల్లో వేయడం వల్ల కాలువలు మూసుకుపోయి డ్రైనేజీ సమస్య ఏర్పడుతుందన్నారు. ఈ పరిస్థితులను నివారించేందుకు సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టి, ట్రాఫిక్, సివిల్ పోలీసుల సహకారంతో జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. అవసరమైతే ట్రేడ్ లైసెన్సులు కూడా రద్దు చేసే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణకు మున్సిపల్ కార్యాలయం, జీజీహెచ్ ఆసుపత్రి, గాంధీచౌక్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ‘వేస్ట్ ప్లాస్టిక్ మార్పిడి’ కేంద్రాల్లో ప్రజలు కిలో ప్లాస్టిక్ వ్యర్థాలను అందజేస్తే కిలో చక్కెర లేదా కిలో సేమియా లేదా ఆరు కోడి గుడ్లను ప్రోత్సాహకంగా ఇస్తారన్నారు. దుకాణాదారులు, వ్యాపారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సమష్టిగా ముందుకు వస్తే పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన నంద్యాలను నిర్మించగలమని కలెక్టర్ రాజకుమారి అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


