● సున్నిపెంట ప్రజలకు శిల్పా చక్రపాణి అభయం
● అఖిలపక్షాలతో ఈనెల 20న సమావేశం
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలంప్రాజెక్ట్ (సున్నిపెంట)లో ప్రభుత్వ గృహాల్లో నివశిస్తున్న వారికి రెవెన్యూ అధికారులు జారీ చేస్తున్న నోటీసులు చెల్లవని, ప్రజలెవరూ అధైర్యపడవద్దని, అండగా తానుంటానని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిలా చక్రపాణిరెడ్డి భరోసా ఇచ్చారు. గురువారం ఆయన ఫోన్లో మాట్లాడుతూ.. సున్నిపెంటలో నివాసితులకు గతంలో ఇంటి పట్టాలు ఇచ్చింది రెవెన్యూ అధికారులని, అలాట్మెంట్ చేసింది జలవనరుల శాఖ అధికారులు అని, అప్పుట్లో జారీ చేసిన ఉత్తర్వులు కాదని వారే ఇప్పుడు ప్రజలు ఆక్రమణలకు పాల్పడ్డారని నోటీసులు ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం గుడ్డిగా, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ఏమీ తెలియని వాడిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 30వేలపైనే జనాభా కలిగిన సున్నిపెంట ప్రజలతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈనెల 20వ తేదీ ఉదయం 9లకు సున్నిపెంటలోని రెడ్ల కళ్యాణమండపంలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు శిల్పా తెలిపారు. సమావేశంలో అందరి అభిప్రాయాలతో సున్నిపెంట ప్రజలు నివాస గృహాలపై పోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరూ నివశించే హక్కును కలిగి ఉన్నారన్నారన్నారు.


