● ఇతరులు పాల్గొనకుండా
టీడీపీ నేతల బెదిరింపులు
● మున్సిపల్ ఆదాయానికి గండి
డోన్: అధికార టీడీపీ నాయకులు మున్సిపల్ అధికారుల లోపాయకారి ఒప్పందం వల్ల గురువారం నిర్వహించిన బహిరంగ వేలం పాటలు కాస్తా నాలుగు గోడల మధ్య జరగడంతో ప్రజలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నలుగురు వ్యక్తులు మాత్రమే వేలం పాటల్లో పాల్గొని అతి తక్కువ ధరకే హక్కులను దక్కించుకోవడం చర్చనీయాశంగా మారింది. ఈ ఎడాది వారపు సంత రూ.3,38,000, దినసరి మార్కెట్ రూ.8,25,000, మాంసం దుకాణాలు రూ.2,28,000, బస్టాండ్ రూ.7,65,000లకు అధికార పార్టీ నేతలు దక్కించుకున్నారు. అంతకు ముందు వేలం పాటలో పాల్గొనేందుకు వచ్చిన కొండపేటకు చెందిన వ్యక్తులను అధికార పార్టీ నేతలను బెదిరించడంతో వారు వేలం పాటలో పాల్గొనకుండా వెళ్లిపోయారు. కేవలం నలుగురు టీడీపీ నేతలు వేలంలో పాల్గొని గతేడాది కంటే రూ.2,56,000 హెచ్చు పాడి హక్కులు దక్కించుకున్నారు. గతేడాది వేలం పాట ద్వారా రూ.19 లక్షలు ఆదాయం రాగా ప్రస్తుతం రూ.21,56,000 పలికినట్లు అధికారులు వెల్లడించారు. సరైన ప్రచారం చేసి ఉంటే వేలం పాటలో పాల్గొనేందుకు అధిక మంది వచ్చి ఉండేవారని ఇలా గుట్టుచప్పుడు గాకుండా వేలం నిర్వహించడంతో మున్సిపల్ ఆదాయానికి గండి పడిందని ప్రజలు ఆరోపిస్తున్నారు.


