
విద్యార్థులూ.. వీరగాథలు రాద్దాంరండి!
నంద్యాల(న్యూటౌన్): విద్యార్థుల్లో సృజనాత్మకతతో పాటు దేశభక్తిని పెంపొందించేందుకు జాతీయ విద్యా, రక్షణ శాఖలు సంయుక్తంగా వీరగాథ 5.0 పేరుతో ఆయా విభాగాల్లో పోటీలను నిర్వహిస్తోంది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల విద్యార్థులకు ఈ పోటీలు నిర్వహిస్తుంది. 3 నుంచి 12వ తరగతి (ఇంటర్) వరకు విద్యార్థులకు నాలుగు విభాగాల్లో పోటీలు చేపడుతున్నారు. విద్యార్థులు దేశభక్తిని పెంపొందిస్తూ, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల గాథలను వివరించడం, వారి త్యాగాలను తెలిపేలా విద్యార్థులకు పద్యాలు, కథలు, చిత్రలేఖనం, వ్యాసరచన, మల్టీమీడియా ప్రదర్శన వంటి పోటీలు నిర్వహిస్తున్నారు. వివిధ పోటీల్లో పాల్గొనే వారికి ఈ నెల 31వ తేదీ గడువు ఇచ్చారు. ఇప్పటికే ఈ పోటీలకు సంబంధించి జిల్లా విద్యా శాఖ ఆయా పాఠశాలలకు ఉత్తర్వులు జారీ చేశారు. వీరగాథ 5.0 పోటీల్లో పాల్గొనే విద్యార్థులు వారికి నచ్చిన అంశాలను ఎంచుకునే అవకాశాన్ని కల్పించారు. దేశం కోసం అత్యున్నత త్యాగం చేసిన వారిని రోల్ మోడల్గా ఎందుకుని, వారి నుంచి నేర్చుకున్న విలువలను ప్రస్తావించాలి. ఆ విద్యార్థికి అవకాశమిస్తే ఏం చేయదలిచాడో చెప్పాలి. ఉదాహరణకు ఝాన్సీ లక్ష్మీబాయి కలలోకి వచ్చి దేశానికి సేవ చేయాలని కోరితే ఏం చేస్తాడో వివరించవచ్చు. 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటును తాను ఆదర్శంగా తీసుకున్న స్వాతంత్య్ర సమరయోధుల జీవిత కథలు విద్యార్థిపై ఎలా ప్రభావితం చేసిందో చెప్పాల్సి ఉంటుంది. అలాగే స్వాతంత్య్ర పోరాటంలో గిరిజనుల తిరుగుబాటు పాత్ర, ఇతర అంశాలను ఎంపిక చేసుకుని వివరించవచ్చు.
నాలుగు విభాగాల్లో..
జిల్లాలోని పాఠశాలల వారీగా వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. 3–5 తరగతులకు ఓ విభాగంగా, 6–8, 9–10, 11–12 తరగతులకు వేర్వేరు కేటగిరీలుగా విభజించారు. 3–5 తరగతుల వారికి పద్యం, కథ (150 పదాలు), చిత్రలేఖనం, పెయింటింగ్, 6–8 తరగతుల వారికి పద్యాలు/ కథ(300 పదాలు), చిత్రలేఖనం, పెయింటింగ్, మల్టీమీడియా ప్రదర్శన. 9–10 తరగతుల వారికి పద్యాలు, వ్యాసం (700 పదాలు), చిత్రలేఖనం, పెయింటింగ్, మల్టీమీడియా ప్రదర్శన. 11–12 తరగతుల వారికి పద్యాలు, వ్యాసం (వెయ్యి పదాలు), చిత్రలేఖనం, పెయింటింగ్, మల్టీ మీడియా ప్రదర్శన ఉంటుంది. ఒకటి లేదా రెండు నిమిషాల నిడివితో దేశభక్తికి సంబంధించిన ప్రదర్శన వీడియో రూపంలో ఇవ్వడమే మల్టీమీడియాగా పరిగణిస్తారు.
ప్రతిభ కనబరుస్తూ..
నంద్యాల జిల్లా పరిధిలో ఉన్న 1,849 ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలో 2,77,625 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఆయా పాఠశాలల్లో తరగతులు, కేటగిరీల వారీగా ఉపాధ్యాయులు పోటీలు నిర్వహిస్తున్నారు. పలు వురు విద్యార్థులు సొంతంగా దేశభక్తిని పెంపొందించేలా చిన్న వీడియోలు రూపొందిస్తున్నారు.
నమోదు విధానం ఇలా..
ఆయా పాఠశాలల విద్యార్థులకు ఉపాధ్యాయులు కేటగిరీలుగా, తరగతుల వారీగా పోటీలు నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్న విద్యార్ధులకు పోటీలు నిర్వహించి, వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఇందుకు ఇన్నోవేటివ్ ఇండియా మై జీవోవీ, ఇన్/వీర్గాథ 5.0 అనే వెబ్సైట్లో నమోదు చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ యువర్ ఎంట్రీ అని ఉన్న చోట క్లిక్ చేసి వివరాలను నమోదు చేయాలి. ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలల నుంచి అత్యుత్తమమైన నాలుగు ఎంట్రీలను అప్లోడ్ చేయాలి. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఉత్తమంగా ఎంపిక చేసిన వాటిని జాతీయ స్థాయికి పంపిస్తారు. జాతీయ స్థాయిలో ఒక్కో విభాగంలో 25 మంది వంతున అత్యుత్తమ ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున నగదు పారితోషికాన్ని, ప్రశంసాపత్రాన్ని అందజేస్తారు.
కేటగిరీలుగా వివిధ అంశాలపై
నిర్వహణ
నాలుగు విభాగాల్లో
విద్యార్థులకు పోటీలు
3 నుంచి 12 తరగతుల వారికి
పలు పోటీలు
ఈనెల 31తో ముగియనున్న గడువు
విద్యార్థులు సద్వినియోగం
చేసుకోవాలంటున్న అధికారులు

విద్యార్థులూ.. వీరగాథలు రాద్దాంరండి!