
ముగిసిన పవిత్రోత్సవాలు
● పూర్ణాహుతితో ఘనంగా ముగిసిన అహోబిల పవిత్రోత్సవాలు
● గోవింద నామస్మరణతో హోరెత్తిన నల్లమల
ఆళ్లగడ్డ: దిగువ అహోబిలంలో వెలసిన శ్రీప్రహ్లాదవరదస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు ఆదివారం తెల్లవారుజామున పూర్ణాహుతితో ముగిశాయి. శనివారం రాత్రి నుంచి వైభవోపేతంగా పూజలు ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి శ్రీ రంగరాజ యతీంత్ర మహాదేశికన్ స్వామీజీ ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదులకు ముందుగా గ్రామోత్సవం, రాత్రి నిత్యపూజ అనంతరం శాంతి హోమాలు నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి, అర్ధరాత్రి అనంతరం ఉత్సవ మూర్తులైన స్వామి అమ్మవార్లకు తిరుమంజనం, సంప్రోక్షణం చేపట్టారు. ఆదివారం తెల్లవారు జామున శాత్తుమురై గోష్టితో పవిత్రోత్సవ కార్యక్రమాన్ని ముగించారు. కార్యక్రమాలను అహోబిలం ప్రధానార్చకులు శ్రీమాన్ శఠకోప వేణుగోపాలన్, మణియార్ సౌమ్యానారాయణ్ ఆధ్వర్యంలో వివిధ ప్రదేశాల నుంచి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన వేద పాఠశాలల పండితులు నిర్వహించారు. ఏడాది పొడువునా ఆలయంలో నిర్వహించే నిత్య కైంకర్యాలు, వార, మాస, వార్షిక మహోత్సవాలు, ఇతరత్రా పూజాది కార్యక్రమాల్లో తెలసీ తెలియక చేసిన తప్పుల వలన ఏర్పడిన దోషాలకు నివారణగా ఏటా నియమనిష్టలతో పవిత్రోత్సవా లు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కార్యక్రమంలో పాల్గొనేందుకు వివిధ ప్రదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

ముగిసిన పవిత్రోత్సవాలు