
చేప కోసం ఘర్షణ
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైల డ్యామ్ దిగువన మంగళవారం కృష్ణానదిలో రెండు వర్గాల మత్స్యకారులు ఒక చేప కోసం ఘర్షణ పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. లింగాలగట్టు వైజాగ్ క్యాంపులోని మత్స్యకారులు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. రెండు వర్గాలు టీడీపీకి చెందినవి. ఈ రెండు వర్గాలు చేప కోసం పడవ తెడ్లతో కొట్టుకున్నారు. డ్యామ్కు వరద ప్రవాహం తగ్గడంతో మంగళవారం గేట్లు మూసివేశారు. దీంతో మత్స్యకారులు డ్యాం ముందుభాగంలో వలలు వేశారు. ఇరువర్గాలకు చెందిన వలల మధ్యలో ఓ చేప చిక్కింది. ఆ చేప తమదంటే తమదని ఒక వర్గంలోని పోలయ్య, బుజ్జి, నూకరాజు, గొందీశ్వరరావు, మరో వర్గంలోని నామరాజు, పి.శ్రీను, సీహెచ్ రమణలు ఘర్షణ పడ్డారు. నదిలోనే పడవలపై తెడ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో 8 తెడ్లు విరిగిపోయాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గాయపడిన వారికి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. కాగా ఇరు వర్గాలు టూటౌన్ పోలీసుస్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఈ విషయమై టూటౌన్ సీఐ చంద్రబాబును వివరణ కోరగా ఇరువర్గాల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు.
● పడవ తెడ్లతో కొట్టుకున్న మత్స్యకారులు