
శ్రీశైలంలో భక్తుల సందడి
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి ఆదివారం భక్తులు అధికసంఖ్యలో తరలిరావడంతో సండే సందడి నెలకొంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామివారి దర్శనానికి క్యూలైన్ వద్దకు చేరుకున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. మూడు విడతలుగా పలువురు భక్తులు టికెట్లు పొంది స్వామివారి స్పర్శదర్శనం చేసుకున్నారు.
రేపటి నుంచి ఇష్టకామేశ్వరీ దర్శనం నిలిపివేత
శ్రీశైలంప్రాజెక్ట్: నల్లమలలో వెలసిన ఇష్టకామేశ్వరీ అమ్మవారి దర్శనం మంగళవారం నుంచి నిలిపేస్తున్నారు. పెద్దపులుల సంయోగ సమయంగా కావడంతో జూలై 1వ తేదీ నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు మూడు నెలల పాటు అమ్మవారి దర్శనానికి అనుమతి లేదని నెక్కంటి అటవీక్షేత్రాధికారి ఆరీఫ్ఖాన్ ఆదివారం తెలిపారు. శ్రీశైలం శిఖరేశ్వరం నుంచి ఇష్టకామేశ్వరి గూడెం వరకు ఎటువంటి వాహనాల రాకపోకలు ఉండవన్నారు. నెక్కంటి జంగిల్ రైడ్గా పేర్కొనే ఇష్టకామేశ్వరీ మాత ఆలయ దర్శనాన్ని నిలిపివేస్తున్న విషయాన్ని భక్తులు గమనించాలని సూచించారు. తిరిగి అక్టోబర్ నెల ప్రారంభంలో అనుమతించనున్నట్లు ఆయన తెలిపారు. జాతీయ పెద్దపులుల సంరక్షణ సంస్థ (ఎన్టీసీఏ) ఆదేశాల మేరకు అటవీ ప్రాంతంలో ఉండే జంగిల్ రైడ్లు, పుణ్యక్షేత్రాల దర్శనాలను నిలిపి వేశారు.
67 మంది గైర్హాజరు
నంద్యాల(న్యూటౌన్): డీఎస్సీ పరీక్షల్లో భాగంగా ఆదివారం రాజీవ్గాంఽధీ మెమోరియల్ కాలేజీలోని పరీక్ష కేంద్రంలో జరిగిన పరీక్షకు 67 మంది గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన పరీక్షకు 85 మంది అభ్యర్థులకు గాను 53 మంది హాజరు కాగా 32 మంది గైర్హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం జరిగిన డీఎీస్సీ పరీక్ష ఐదు కేంద్రాల్లో జరిగిందన్నారు. 790 మంది అభ్యర్థులకు గాను 755 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 35 మంది గైర్హాజరయ్యారు. డీఎస్సీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీఈఓ జనార్ధన్రెడ్డి తెలిపారు.
నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దర ఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశ లో ఉందో సమాచారం తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1100ను సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov.in వెబ్సైట్లో తెలుసుకోవడంతో పాటు తమ అర్జీలను కూడా నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.