
బదిలీల కౌన్సెలింగ్ గందరగోళం
● సచివాలయాల ఉద్యోగుల్లో ఆందోళన
● టీడీపీ నేతల సిఫార్సులకే
అధికారుల మొగ్గు
కర్నూలు (టౌన్): సచివాలయాల ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్లో గందరగోళం నెలకొంది. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ‘టిక్ పెట్టండి.. వెళ్లిపోండి’ అంటూ చెప్పడంతో సచివాలయాల ఉద్యోగులు అవాక్కుయ్యారు. ‘ఇదేం కౌన్సెలింగ్ తీరు’ అంటూ వాగ్వావాదానికి దిగారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మున్సిపాలిటీల్లో పనిచేసే సచివాలయాల ఉద్యోగులకు రెండు రోజుల్లో కౌన్సెలింగ్ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో హడావుడిగా కర్నూలు కార్పొరేషన్ ఆధికారులు శనివారం సుంకేసుల రోడ్డులో ఉన్న నగరపాలక సంస్థ నూతన కౌన్సిల్ హాలులో కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించారు.
నిబంధనలకు విరుద్ధంగా..
ఉమ్మడి జిల్లాలో 308 సచివాలయాలు ఉన్నాయి. ఒకే చోట పనిచేస్తూ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారిలో 173 ఆడ్మిన్ కార్యదర్శలు, 235 ఎడ్యుకేషన్ కార్యదర్శులు, 248 వెల్ఫేర్ కార్యదర్శులు, 208 మంది శానిటేషన్ కార్యదర్శులు ఉన్నారు. వీరందరికీ రెండు రోజుల పాటు కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంది. మొదటి రోజు ఉదయం 8 నుంచి 10.30 గంటల వరకు వార్డు శానిటేషన్ కార్యదర్శులకు, 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు వార్డు ఎడ్యుకేషన్ కార్యదర్శులకు, సాయంత్రం 5 నుండి 7.30 గంటల వరకు వెల్ఫేర్ కార్యదర్శులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. వచ్చిన వారు మూడు ఆప్షన్లు ఎంచుకొని వెళ్లాలని కమిషనర్ చెప్పడంతో సచివాలయాల ఉద్యోగుల సంఘం జేఏసీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బదిలీల కౌన్సెలింగ్ చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
నేడు ప్లానింగ్ కార్యదర్శుల బదిలీల
కౌన్సెలింగ్ బహిష్కరణ
ఈనెల 29వ తేదీ ఆదివారం వార్డు ప్లానింగ్, ఎమినిటీ స్ కార్యదర్శులకు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంది. ఈ కౌన్సెలింగ్ను బహిష్కరిస్తున్నట్లు సచివాలయాల ఉద్యోగుల సంఘం నాయకులు శివప్రసాద్, ఆలీ, భాస్కర్, జ్యోత్న్స, తారకేశ్వర్ రెడ్డి, అమర్ నాథ్, ప్రసాద్ తెలిపారు. కర్నూలు కార్పొరేషన్ ఆధికారులు అన్యాయంగా బదిలీల కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు.
కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల ఆందోళన
కర్నూలు కమిషనర్ రవీంద్రబాబు తమకు అన్యాయం చేస్తున్నారంటూ సచివాలయాల ఉద్యోగులు శనివారం రాత్రి భారీగా కలెక్టరేట్కు చేరుకుని ఆందోళన చేశారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో డీఆర్ఓవెంకట నారాయణమ్మకు వినతిపత్రం ఇచ్చారు. అయితే జర్నలిస్టులు రావడంతో ‘మీడియాకు ఎందుకు చెప్పారు’ అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ నేతల సిఫార్సులకే మొగ్గు..
ఎక్కడా లేని విధంగా కర్నూలులో బదిలీల కౌన్సెలింగ్ గుట్టుగా చేయడం ఏంటని కొందరు సచివాలయ ఉద్యోగులు ప్రశ్నించారు. కేవలం టీడీపీ నేతలు సిఫార్సు చేసిన వారు మాత్రమే కర్నూలు అర్బన్, పాణ్యం అర్బన్, కోడుమూరు అర్బన్లో కొనసాగే విధంగా అధికారులు చర్యలు చేపట్టారన్న విమర్శలు వచ్చాయి. సిఫార్సు లేని వారికి ఎక్కడ పడితే అక్కడ బదిలీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.