
పెట్టుబడి ‘మట్టి’పాలు
రుద్రవరం: ముందస్తు వర్షాలు మిరప రైతులను నట్టేట ముంచాయి. ఊరించిన వరుణుడు మొహం చాటేయడంతో పెట్టుబడి నేలపాలైంది. మండల కేంద్రమైన రుద్రవరంతో పాటు రెడ్డిపల్లె, ఆర్.నాగులవరం, తిప్పారెడ్డిపల్లె, ఆలమూరు, చిత్రేనిపల్లె తదితర గ్రామాల్లో దాదాపు 800 ఎకరాల్లో పచ్చి మిర్చి పంటను సాగు చేశారు. ఒక్కో ఎకరానికి రూ. లక్ష చొప్పున పెట్టుబడి పెట్టారు. నారు వేసిన నాటి నుంచి 40 రోజులకు పూత, పిందె రావాల్సి ఉంది. అయితే 60 రోజులు దాటినా పూత, పిందె రాక ఎదుగుదల లేక పోవడంతో కొందరు రైతులు మిర్చి పంటను దున్నేసి తిరిగి మొక్క జొన్న పంట సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్. నాగులవరం గ్రామానికి చెందిన సుబ్బ నర్సయ్య ఐదు ఎకరాల్లో మిరప సాగు చేయగా.. వర్షాలు లేక పంట పూత లేకపోవడంతో ఆదివారం తొలగించాడు.