
సెలవు రోజూ తప్పని తిప్పలు
కర్నూలు(అర్బన్): గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలను ఈ నెల 30వ తేదీలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆదివారం సెలవు అయినా సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా పరిషత్ సమావేశ భవనంలో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ –6 ( డిజిటల్ అసిస్టెంట్ ) బదిలీలకు సంబంధించిన కౌన్సిలింగ్ను నిర్వహించారు. కర్నూలు జిల్లాలో మొత్తం డిజిటల్ అసిసెంట్లు 375 మంది ఉండగా, వీరిలో ఐదు సంవత్సరాలు ఒకే ప్రాంతంలో సర్వీసును పూర్తి చేసుకున్న వారు 207 మంది, రిక్వెస్ట్ బదిలీలు కోరుతు 71 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికి జిల్లా పంచాయతీ అధికారి జీ భాస్కర్, కర్నూలు డీఎల్పీఓ టీ లక్ష్మి, కార్యాలయ ఏఓ ప్రతిమ కౌన్సెలింగ్ నిర్వహించి ఉద్యోగుల ఆప్షన్స్ తీసుకున్నారు. అలాగే నంద్యాల జిల్లాలో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ –6 ( డిజిటల్ అసిస్టెంట్లు ) మొత్తం 404 మంది ఉండగా, ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారు 258, రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకున్నా వారు 30 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా కౌన్సెలింగ్కు హాజరయ్యారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమావేశ భవనంలో జరిగిన నంద్యాల జిల్లా ఉద్యోగుల కౌన్సిలింగ్ డీపీఓ లలితాబాయి ఆధ్వర్యంలో నిర్వహించారు.
జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ...
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ల బదిలీలకు సంబంధించిన కౌన్సెలింగ్ స్థానిక జీ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియం హాల్లో నిర్వహించారు. ఈ ఏడాది మే 31వ తేదీ నాటికి జిల్లాలోని ఒకే ప్రాంతంలో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారు 570 మంది, రిక్వెస్ట్ బదిలీలను కోరుతు 131 మంది దరఖాస్తు చేసుకున్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియ సాంఘిక సంక్షేమ శాఖ డీడీ కే తులసీదేవి ఆధ్వర్యంలో కొనసాగింది. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన సహాయ సంక్షేమాధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.