
మల్లన్న ఆలయంలోని హుండీకి కన్నం?
● కానుకలు చోరీచేసిన నలుగురు
● ఓ ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలోని మల్లికార్జున స్వామి గర్భగుడిలో ఉన్న హుండీకి నలుగురు మైనర్లు కన్నం వేసినట్లు సమాచారం. ఈనెల 1న ఉచిత దర్శన క్యూలైన్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన మైనర్లు గర్భగుడిలోని రత్నగర్భ గణపతి ఆలయం వద్ద ఉన్న (క్లాత్)హుండీని బ్లేడ్తో కోసి, అందులో కొంత డబ్బు తీస్తుండగా దేవస్థాన సూపరింటెండెంట్ పట్టుకున్నట్లు సమాచారం. వారి వద్ద నుంచి సుమారు రూ.10 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పది రోజుల నుంచి నలుగురు మైనర్లు దర్శనం పేరుతో ఉచిత క్యూలైన్ల ద్వారా ఆలయంలో తరచూ తిరిగినట్లు వెల్లడైంది. ఈఓ ఆదేశాలతో దేవస్థాన సీఎస్ఓ ఫిర్యాదు మేరకు శ్రీశైలం ఒకటో పట్టణ స్టేషన్ ఆఫీసర్ కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సమాచారం. చోరీ విషయమై విధుల్లో అలసత్వం ప్రదర్శించిన సీనియర్ అసిస్టెంట్ను బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బాలుడి కుటుంబానికి ఆర్థికసాయం
బేతంచెర్ల: స్థానిక హనుమాన్ నగర్కు చెందిన నాలుగేళ్ల బాలుడు షేక్ మొహిద్దీన్ ఈనెల 2న కుక్కల దాడిలో మృతిచెందిన విషయం విదితమే. బాలుడి తల్లిదండ్రులకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డోన్ ఆర్డీఓ నరసింహులు, మండల ప్రత్యేక అధికారి బషీరున్నీసా బేగం, తహసీల్దార్ ప్రకాశ్బాబు, నగర పంచాయతీ కమిషనర్ హరిప్రసాద్ రూ.3 లక్షల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది మధు, తేజ పాల్గొన్నారు.
భగీరథుడిని స్మరించుకోవాలి
నంద్యాల(అర్బన్): భగీరథుడిని స్మరించుకోవడం అందరి బాధ్యత అని రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. భగీరథ మహర్షి జయంతిని ఆదివారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ భగీరథుడు వారి పూర్వ పితామహులకు స్వర్గ ప్రాప్తి కల్పించేందుకు దివి నుంచి గంగను భువికి తెచ్చేలా చేశారన్నారు. కార్యక్రమంలో సగర సంఘం జిల్లా నాయకులు సురేష్కుమార్, శివయ్య, బాలరాజు, బాలాజీ, చిన్నయ్య, జిల్లా సంక్షేమ అధికారి ఓబులేసు, తదితరులు పాల్గొన్నారు.
నేడు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
నంద్యాల(న్యూటౌన్): జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాలులో ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ సూచనల మేరకు వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే ప్రజలు ఎవ్వరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఉదయం 9.30 గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం 12.30 గంటలకు ముగించనున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిల్లోనూ పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
నీట్కు 1,144 మంది హాజరు
నంద్యాల(న్యూటౌన్): నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. నంద్యాలలో నాలుగు కేంద్రాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్ష జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,176 మందికి గాను 1,144 మంది హాజరు కాగా 32 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల ఎదుట కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామన్నారు. దివ్యాంగ విద్యార్థులకు అన్ని పరీక్ష కేంద్రాల ఎదుట వీల్చైర్లను అందుబాటులో ఉంచామన్నారు. పరీక్ష కేంద్రాలను ఆర్డీఓ విశ్వనాథ్, డీఎస్పీ మందా జావలి ఆల్ఫోన్స్ తమ సిబ్బందితో పర్యవేక్షించారు.

మల్లన్న ఆలయంలోని హుండీకి కన్నం?