
పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
ఆలూరు రూరల్: పరీక్షల్లో ఫెయిల్ అయ్యాయని మనస్తాపానికి చెందిన పదో తరగతి విద్యార్థి సిద్ధార్థ్ (15) ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు తెలిపిన వివరాలు.. ఆలూరులోని కొట్టాల వీధికి చెందిన శ్రీనివాసులు, దానమ్మ దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. మూడో సంతానమైన సిద్ధార్థ్ (15) స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల–1 పదో తరగతి చదివారు. గత ఏప్రిల్ 23న వెలువడిన ఫలితాల్లో సిద్ధార్థ్ ఫెయిల్ అయ్యాడు. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఊరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బంధువులు గమనించి ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. సిద్ధార్థ్ పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు బళ్లారి ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు. వారం రోజులుగా చికిత్స పొందుతూ గురువారం కోలుకోలేక మృతి చెందాడు. సిద్ధార్ మృతికి ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
బాలికపై పందుల దాడి
కల్లూరు: ఆటలు ఆడుకుంటున్న బాలికపై పందులు దాడి చేయడంతో గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం కల్లూరు అర్బన్ 32వ వార్డు పరిధిలోని పోలీస్ కాలనీలో చోటుచేసుకుంది. గురువారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. చుట్టుపక్కలవారు గమనించి పందులను తోలడంతో చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. తల్లిదండ్రులు చిన్నారిని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. కాలనీలో పందుల బెడద ఎక్కువగా ఉందని, అధికారుల స్పందించి సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
బెల్లం ఊట ధ్వంసం
ఆత్మకూరు: సిద్ధాపురం గ్రామానికి రెండు కి.మీ. దూరంలోని అటవీ ప్రాంతంలో నాటుసారా తయారీకి ఉపయోగించే 600 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ కిషోర్కుమార్ గురువారం తెలిపారు. పీటల రాంప్రసాద్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశామన్నారు. ఎవరైనా అక్రమంగా నాటుసారా తయారు చేసినా, విక్రయించినా అలాంటి వారిపై కేసులు నమోదు చేసి జైలుకు తరలిస్తామన్నారు. నాటుసారా తయారు చేసే వారి వివరాలను 9440902585, 9177299067, 8328307774కు సమాచారం అందించాలన్నారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు.