
చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీద్దాం
● 4న వెన్నుపోటు దినం భారీగా నిర్వహిద్దాం
● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి
కర్నూలు (టౌన్): విద్యార్థులను, మహిళలను, రైతులను, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీద్దామని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. ఈనెల 4న నిర్వహించే ‘వెన్నుపోటు దినం’ నిరసనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావాలన్నారు. కల్లూరులోని తన గృహంలో పాణ్యం నియోజకవర్గంలోని జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు. సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మోసం చేశారన్నారు. ప్రశ్నించిన వారిని వేఽధించడమే పనిగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుందన్నారు. రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో దళితుల బహిష్కరణ వంటి దుర్మార్గపు పాలన జరుగుతోందన్నారు. వేలం లేకుండా, క్యాబినెట్లో చర్చించకుండా దేవదాయ భూములను టీడీపీ నాయకులకు అప్పగించేందుకు చీకటి జీవో తెచ్చారని ఆరోపించారు. టీడీపీ నాయకులకు అనుకూలంగా పోలీసులు అత్యుత్సాహం చేయడం తగదన్నారు. అనంతరం ‘వెన్నుపోటు దినం’ పోస్టర్లను అవిష్కరించారు. కార్పొరేటర్ దండు లక్ష్మీకాంతా రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జెడ్పీటీసీ సభ్యులు సూర్యనారయణ రెడ్డి, మిడుతూరు శ్రీనివాసులు, పార్టీ నాయకులు హనుమంతరెడ్డి, భీమేశ్వరరెడ్డి, క్రిష్ణమూర్తి, కర్నూలు డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి, కార్పొరేటర్లు నారాయణ రెడ్డి, నాగలక్ష్మీరెడ్డి. అరుణ, సుదర్శన్ రెడ్డి, చిట్టెమ్మ తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీద్దాం