అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తే చర్యలు

Jun 6 2025 12:57 AM | Updated on Jun 6 2025 12:57 AM

అసాంఘ

అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తే చర్యలు

డోన్‌ టౌన్‌: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, వాటిని ప్రోత్సహించినా వదలిపెట్టే ప్రసక్తే లేదని ఎస్సీ అధిరాజ్‌ సింగ్‌ రాణా హెచ్చరించారు. గురువారం డోన్‌ పట్టణ పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఆయా కేసులపై డీఎస్సీ శ్రీనివాసులు, సీఐ ఇంతియాజ్‌బాషాతో సమీక్షించారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. యథేచ్ఛగా మద్యం విక్రయాలు, మందుబాబుల ఆగడాలు తదితర అంశాలపై ఆరా తీశారు. పట్టణంలో గంజాయి విక్రయాలు, మట్కా, జూదం తదితర అంశాలను చర్చిస్తూ అడ్టుకట్ట వేయాలని ఆదేశించారు. పట్టణంలో ఇటీవల జరిగిన స్ట్రీట్‌ ఫైట్‌లు, గొడవలు తదితర అంశాలపై ఆరాతీసి ఎలాంటి చర్యలు తీసుకున్నారని వివరణ కోరారు. ఆయా స్టేషన్ల వారీగా నమోదైన కేసుల వివరాలు, కేసుల స్వభావాలు, ఇన్వెష్టిగేషన్‌ తదితర విషయాలను చర్చించి కేసుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. సమీక్షలో ఎస్‌ఐలు శరత్‌కుమార్‌రెడ్డి, నరేంద్రకుమార్‌ పాల్గొన్నారు.

దోమల నివారణతోనే మలేరియా అంతం

గోస్పాడు: దోమల నివారణతోనే మలేరియా అంతమవుతుందని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వెంకటరమణ అన్నారు. మలేరియా నివారణ మాసోత్సవాలు కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయంలో వద్ద జిల్లా మలేరియా అధికారి కామేశ్వరరావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ మలేరియా నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. వర్షా కాలం ప్రారంభం కానుండటంతో జూలై నుంచి నవంబర్‌ వరకు సీజన్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇంటి పరిసరాల్లో బంతిపూలు, పుదీన, తులసి మొక్కలు వేసుకోవడం వల్ల దోమలు వచ్చే అవకాశం తగ్గుతుందని సూచించారు. అనంతరం జిల్లాలోని మలేరియా సబ్‌ యూనిట్‌ ఆఫీసర్లు, హెల్త్‌ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మలేరియా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు సక్రమంగా, సకాలంలో అందించేలా చూడాలన్నారు. కార్యక్రమంలో కార్యాల య సిబ్బంది రామవిజయరెడ్డి పాల్గొన్నారు.

45 లక్షల పనిదినాలు

కల్పించాలి

జూపాడుబంగ్లా: జూన్‌ నెలాఖరులోగా జిల్లాలో 45 లక్షల పనిదినాలు కల్పించాల్సి ఉందని డ్వామా పీడీ వెంకటసుబ్బయ్య అన్నారు. గురువారం ఆయన ఎంపీడీఓ కార్యాలయంలో ఆ శాఖ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధిహామీ పనులు కల్పించటంతో నంద్యాల జిల్లా ఐదో స్థానంలో ఉందన్నారు. ఉపాధికూలీలకు ఇప్పటి దాకా 36 లక్షల పనిదినాలు కల్పించామని మిగిలిన 9 లక్షల పని దినాలను ఈనెలాఖరులోగా పూర్తిచేస్తామన్నారు. ఉపాధి కూలీలకు 8 వారాల నుంచి బిల్లులు చెల్లింపు కాలేదనే విలేకరులు ప్రశ్నించగా.. వచ్చే వారంలో జమ చేయనున్నట్లు తెలిపారు. పల్లె పండుగ సిమెంటురోడ్ల బిల్లులకు సంబంధించి లేబర్‌కాంపోనెంటు, మెటీరియల్‌ బిల్లులు వారంలోగా చెల్లింపు జరిగే అవకాశం ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,169 ఫాంపాండ్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

శ్రీశైలం డ్యాం నీటిమట్టం 835 అడుగులు

శ్రీశైలం ప్రాజెక్ట్‌: శ్రీశైలం జలాశయ నీటిమట్టం గురువారం సాయంత్రం సమయానికి 835 అడుగులకు చేరుకుంది. బుధవారం నుంచి గురువారం వరకు ఎగువ జూరాల, సుంకేసుల నుంచి 19,785 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు 4,598 క్యూసెక్కుల నీరు విడుదలైంది. కుడిగట్టు కేంద్రంలో 0.906, ఎడమగట్టు కేంద్రంలో 0.842 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్‌కు 3,731 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బ్యాక్‌ వాటర్‌ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు 867 క్యూసెక్కుల నీటిని వదిలారు. ప్రస్తుతం జలాశయంలో 55.0470 టిఎంసీల నీరు నిల్వ ఉంది.

అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తే చర్యలు 1
1/2

అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తే చర్యలు

అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తే చర్యలు 2
2/2

అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తే చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement