
పాఠశాలల్లో పెండింగ్ పనులు 12లోపు పూర్తి చేయాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల(న్యూటౌన్): పీఎంశ్రీ స్కూళ్లలో పెండింగ్ నిర్మాణాల పనులను ఈ నెల 12లోపు పూర్తి చేయాలని సమగ్ర శిక్ష ఇంజినీర్లను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాలల్లో నిర్మాణ పనులు పూర్తయితే హెచ్ఎంలు సంతృప్తికరంగా ఉన్నట్టు ఽధ్రువీకరించాలన్నారు. నాణ్యతపై ఇంజినీర్లు ధ్రవీకరణం ఇచ్చి సంబంధిత బిల్లులను ఎంబుక్లో నమోదు చేసి అప్లోడ్ చేస్తేనే నిధులు విడుదలవుతాయన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమయ్యే మరుగుదొడ్లను ముందుగా పూర్తి చేయాలన్నారు. మోడల్ స్కూళ్లలో ఏర్పాటు చేసిన సోలార్ ఫలకాలను గ్రిడ్కు అనుసంధించాల్సిన వివరాల నివేదికను ఇవ్వాలన్నారు. సమగ్ర శిక్ష ఏపీసీ ప్రేమాంత్ కుమార్, ఎస్ఎస్ఎ ఈఈ శ్రీనివాసులు, డీఈ నాగభూషణం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పారదర్శకంగా
పోలీసుల బదిలీలు
బొమ్మలసత్రం: పోలీసుల బదిలీలు పారదర్శకంగా చేస్తామని జిల్లా ఎస్పీ అధిరాజ్సింగ్రాణా తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్డేను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బదిలీల కోసం వివిధ పోలీస్టేషన్లలో పనిచేస్తున్న సిబ్బంది నుంచి పలు వినతులను అందుకున్నామన్నారు. జిల్లాలో పనిచేస్తున్న 13 మంది పోలీసులు వినతులు సమర్పించారని తెలిపారు. క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని సూచించారు. ఎస్బీ సీఐలు మోహన్రెడ్డి, సూర్యమౌళి తదితరులు పాల్గొన్నారు.
స్కానింగ్ సెంటర్ల తనిఖీ తప్పనిసరి
గోస్పాడు: స్కానింగ్ సెంటర్లను తప్పనిసరిగా తనిఖీ చేయాలని వైద్యారోగ్య శాఖ అధికారులను డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ ఆదేశించారు. నంద్యాల పట్టణంలోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త స్కాన్ సెంటర్లు తప్పనిసరిగా జిల్లా కమిటీ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ప్రతి ఐదు సంవత్సరాలకు రెన్యూవల్ చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన కంపెనీ నుంచే స్కానింగ్ మిషన్లను కొనుగోలు చేయాలని, జిల్లా వైద్య శాఖ దగ్గర అనుమతి తీసుకోవాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఎన్జీఓ రాజశేఖర్, ఇంచార్జ్ డెమో రవీంద్ర నాయక్, వంశీ పాల్గొన్నారు.
ఎన్ఎంఎంఎస్
ఫలితాల విడుదల
కర్నూలు కల్చరల్: జాతీయ ఉపకార వేతన పరీక్ష (ఎన్ఎంఎంఎస్) ఫలితాలు విడుదల అయ్యాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.శామ్యూల్ పాల్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది డిసెంబర్ 8న పరీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు. మెరిట్ కార్డులు www. bse.ap.gov.inలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎంపికై న విద్యార్థులు బ్యాంక్ అకౌంట్ తెరిచి విద్యార్థి ఆధార్ను లింక్ చేయించి డీబీటీ ద్వారా డబ్బులు జమ అయ్యే విధంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు.