
రాజకీయంగా ఓర్వలేకనే హత్య
కర్నూలు: రాజకీయంగా ఓర్వలేకనే టీడీపీ వర్గీయులు తన భర్త రమేష్ నాయుడును హత్య చేశారని భార్య లక్ష్మీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ రమేష్ నాయుడు(45)ను గురువారం రాత్రి ప్రత్యర్థులు అతి కిరాతకంగా హత్య చేయడం తెలిసిందే. రమేష్ నాయుడు భార్య లక్ష్మిదేవి కుటుంబ సభ్యులతో కలసి శుక్రవారం కర్నూలు రూరల్ తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు మేడం రామాంజినేయులు, మేడం తిరుపాలు, మేడం నాయుడు, మేడం శ్రీనివాసులు, మేడం రాజు, బుగ్గ రాముడులపై హత్య కేసు నమోదు చేసినట్లు సీఐ చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇరు వర్గీయుల ఫోన్కాల్ డేటాను విశ్లేషిస్తున్నామని, రెండు రోజుల్లో హత్యకు కారణాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో శవ పరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కర్నూలు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు, పార్టీ శ్రేణులు మార్చురీ కేంద్రం వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల రోదన మిన్నంటింది.
పోలీసులకు రమేష్ నాయుడు భార్య లక్ష్మీదేవి ఫిర్యాదు
ఆరుగురిపై కేసు నమోదు