
ఉలిక్కిపడ్డ మీదివేముల
రమేష్నాయుడిది ముమ్మాటికీ రాజయకీయ హత్యే!
● అధికార పార్టీ నాయకులే హత్య
చేశారని మాజీ ఎమ్మెల్యే
కాటసాని ఆరోపణ
● నిందితులపై కఠిన చర్యలు
తీసుకోవాలని డిమాండ్
పాణ్యం: వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు రమేష్నాయుడు హత్యతో ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామం ఉలిక్కి పడింది. మృతుడు కర్నూలు మార్కెట్యార్డు మాజీ చైర్మన్ ప్రభాకర్రెడ్డికి ప్రధాన అనుచరుడు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ గెలుపొందినా, మీదివేముల గ్రామంలో వైఎస్సార్సీపీకి మెజార్టీ వచ్చింది. గ్రామంలో వైఎస్సార్సీపీ బలంగా ఉండటంతోనే ఆ పార్టీ వర్గీయుడైన, స్థానికంగా ప్రజల్లో పట్టు ఉన్న రమేష్ను టీడీపీ వర్గీయులే మట్టుపెట్టి ఉంటారనే చర్చ జరుగుతోంది. గతంలో కూడా రమేష్నాయుడు ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఇదిలాఉంటే హత్యోదంతంపై మృతుని భార్య ఆరుగురు టీడీపీ వర్గీయులపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఆరోపించారు. కాటసానితో పాటు కర్నూలు మార్కెట్యార్డు మాజీ చైర్మన్ ప్రభాకర్రెడ్డి గురువారం రాత్రే మీదివేముల గ్రామం చేరుకొని ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి తామంతా అండగా ఉంటామని భరోసా కల్పించారు. అనంతరం జిల్లా ఎస్పీ విక్రాంత్పటేల్తో ఘటనపై చర్చించారు.
అధికారి పార్టీ నాయకుల కుట్రే: కాటసాని
రమేష్నాయుడు హత్య ముమ్మాటికీ రాజకీయ కారణాలతో జరిగిందేనని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. ప్రశాంతగా ఉన్న గ్రామాల్లో హత్యలు చేసి ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు. రామేష్నాయుడిని రాజకీయంగా ఎదుర్కొలేకనే హత్య చేశారన్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగానికి ఈ హత్య మరో ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. గతంలో అనేక సార్లు రమేష్నాయుడిపై దాడులకు తెగబడ్డారని, ఈ విషయాన్ని తాము పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం వల్లే ప్రాణం పోయిందన్నారు. నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఎస్పీ విక్రాంత్పాటిల్ను కోరామన్నారు. రమేష్నాయుడి కుటుంబానికి అన్నివిధాల అండగా ఉంటామన్నారు.

ఉలిక్కిపడ్డ మీదివేముల

ఉలిక్కిపడ్డ మీదివేముల