
తాగునీటితో దర్జా ‘సాగు’తోంది!
● జీడీపీ ఎడమ కాల్వ తూము తెరిచిన టీడీపీ నేత
● తాగునీటి నిల్వలు సాగుకు మళ్లించిన వైనం
గోనెగండ్ల: ‘మమ్మల్ని ఎవరూ ఆపేది’.. అంటూ ఓ టీడీపీ నేత గాజులదిన్నె ప్రాజెక్ట్లో తాగునీటి అవసరాలకు నిల్వ ఉంచిన నీటిని దర్జాగా సాగుకు మళ్లించాడు. టీడీపీ నేత ఘన కార్యాన్ని అధికారులు లీకేజీ పేరుతో దాచేస్తుండటం కొసమెరుపు. జీడీపీ కింద సాగునీటికి కేవలం రబీ సీజన్లో మాత్రమే విడుదల చేయాల్సి ఉంది. అయితే వర్షాధారం కింద ముందస్తు వేసిన పంటలకు నీరందించేందుకు జీడీపీ నీటిని విడుదల చేయడంపై రైతులు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వర్షాలు ఆలస్యమై తాగునీటి సమస్య ఏర్పడితే తమ ‘గోడు’ ఎవరికి చెప్పుకోవాలని ప్రజలు వాపోతున్నారు. జీడీపీ నుంచి పత్తికొండ, డోన్ తదితర పట్టణాలకు తాగునీటి కోసం విడుదల చేస్తారు. ఓ టీడీపీ నేత శనివారం ఎడమ కాల్వ తూము గేటు ఎత్తి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 1.1 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. వర్షాలు కురిసి వరద నీరు జీడీపీలో వచ్చి చేరేంత వరకు ప్రస్తుతం ఉన్న ఈ నీటితోనే తాగునీటి పథకాలకు విడుదల చేయాల్సి ఉంది. నీటి విడుదల అధికారులకు తెలిసే జరిగి ఉంటుందని పలువురు అనుమానిస్తున్నారు. ఈ విషయంపై డీఈ విజయ కుమార్ వివరణ కోరగా.. ప్రాజెక్టు ఎడమ కాలువలో ప్రవహిస్తున్న నీరు లీకేజీ మాత్రమేనని.. లీకేజీలకు అడ్డుకట్ట వేసి నీటి వృథాను అరికడతామన్నారు.

తాగునీటితో దర్జా ‘సాగు’తోంది!