
అంతంతమాత్రం తేమలో విత్తనం వేయొద్దు
కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్కు సంబంధించి అంతంతమాత్రం తేమలో విత్తనం విత్తుకోవద్దని ఏరువాక కేంద్రం కో–ఆర్డినేటర్, ప్రధాన శాస్త్రవేత్త సుజాతమ్మ తెలిపారు. నల్లరేగడి నేలల్లో 75 మి.మీ వర్షపాతం ఒక్క రోజులో నమోదైనా లేదా వరుసగా మూడు రోజుల్లో నమోదైనప్పుడు మాత్రమే విత్తనం వేసుకోవాలని సూచించారు. ఎర్ర నేలల్లో కనీసం మూడు రోజులు లేదా ఒక్కరోజులో 50 మి.మీ వర్షపాతం నమోదైతేనే విత్తనం వేసుకోవాలన్నారు. అంతంతమాత్రం తేమలో విత్తనం వేసుకుంటే మొలక సరిగా రాద ని పేర్కొన్నారు. ప్రస్తుతం పచ్చిరొట్ట ఎరువులు వేసుకునేందుకు ఇది చక్కటి అదును అన్నారు. వరిలో జనుము, జీలుగ, పిల్లి పెసర వేసుకోవచ్చని, మెట్ట పంటల్లో పిల్లిపెసర వేసుకోవచ్చని వివరించారు. కాగా శనివారం మధ్యాహ్నం నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి.
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
మహానంది: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం, ప్రశాంతతను పొందవచ్చని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. మహానంది ఆలయ ప్రాంగణంలో శనివారం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికారులు అందరూ యోగాసనాలు వేశారు. ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన శ్రీశైలం, మహానంది, అహోబిలం, బెలుం గుహలు, పచ్చర్ల జంగిల్ క్యాంప్లో యోగా కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు పకడ్బందీ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. జేసీ విష్ణుచరణ్, ఆర్డీఓ విశ్వనాథ్, డీఎంహెచ్ఓ వెంకటరమణ, ఆయుష్ వైద్యాధికారి యశోధర, మహానంది ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి, వేదపండితులు చెండూరి రవిశంకర అవధాని తదితరులు పాల్గొన్నారు.