
మంత్రి బీసీకి పరిజ్ఞానం ఉందా?
డోన్: కనీస పరిజ్ఞానం లేకుండా రాష్ట్ర రోడ్డు రవాణా శాఖా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తనపై ఆరోపణలు చేయడం ఆశ్చర్యాన్ని కలిగించిందని మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. శనివారం డోన్ పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రి బీసీ చేసిన ఆరోపణలను మాజీ మంత్రి బుగ్గన ఖండించారు. ‘సాక్షి’తో బుగ్గన ఫోన్లో మాట్లాడారు. వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులకు ఆర్థికశాఖ మంత్రులు వ్యక్తిగతంగా ఎలా బాధ్యత వహిస్తారనే విషయం మంత్రికి తెలియదా అని ప్రశ్నించారు. సరైన సమాచారం తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం తగదన్నారు.
ఏడాదికే రూ. 5లక్షల కోట్ల అప్పు
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో లక్షా ముప్పై వేల కోట్లు అప్పులు చేస్తే ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఐదు లక్షల నూట తొంభై రెండు వేల కోట్లు అప్పు ఎందుకు చేసిందో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని బుగ్గన డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేసే అప్పులకు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవులు వ్యక్తిగతంగా బాధ్యత వహిస్తే వైఎస్సార్సీపీ హయంలో చేసిన అప్పులకు తాను కూడా బాధ్యత వహిస్తానని మాజీ మంత్రి బుగ్గన అన్నారు. అప్పుల విషయంపై మంత్రి బీసీ తనను డిబేట్కు రావాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. అసెంబ్లీ కంటే పవిత్రమైన వేదిక వేరేది ఉందనుకుంటే ఎక్కడికై నా బీసీతో డిబేట్కు రావడానికి తాను సిద్ధమేనని మాజీ మంత్రి బుగ్గన ప్రతిసవాల్ విసిరారు.
ఫ్యాక్టరీని తెరిపిస్తే
మూత వేయించినది ఎవరు?
2014కు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో మూత పడిన పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి తెరిపించామని మాజీ మంత్రి బుగ్గన అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే టీడీపీ ప్రభుత్వం సిమెంట్ ఫ్యాక్టరీని మూత పడేటట్టు చేసి వందలాది కార్మికులను రోడ్డున పడేసిన చరిత్ర కూటమి ప్రభుత్వానిదే అన్నారు.
ఏ గ్రామానికి రోడ్డు వేయించారు?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాము రోడ్లు వేయిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ.. డోన్ నియోజకవర్గంలో ఏ గ్రామానికి రోడ్డు వేశారో చెప్పాలని మాజీ మంత్రి బుగ్గన సవాల్ విసిరారు. ఇతరులు ఇచ్చిన తప్పుడు సమాచారం మేరకు మాట్లాడటం మంత్ర బీసీకి భావ్యం కాదన్నారు.
సమాచారం తెలుసుకోకుండా
ఆరోపణలు చేస్తారా?
మాజీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన