
పుణ్యక్షేత్రాల అభివృద్ధికి అహల్యా బాయి కృషి
శ్రీశైలంటెంపుల్: దేశంలోని పలు పుణ్యక్షేత్రాల పునరుద్ధరణకు అహల్యా బాయి హూల్కర్ కృషి చేశారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖమంత్రి సత్యకుమార్ తెలిపారు. మహారాష్ట్రకు చెందిన మహారాణి అహిల్యాభాయి హూల్కర్ 300వ జయంతి సందర్భంగా శనివారం శ్రీశైలంలోని మల్లికార్జున కల్యాణ మండపంలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ అహిల్యాబాయి అతి చిన్న వయస్సులోనే రాజ్యభారాన్ని చేపట్టి సుపరిపాలన చేశారన్నారు. కాశి, హరిద్వార్, కేదార్నాథ్, బద్రీనాథ్, రుషికేష్, శ్రీశైలం, పూరి, రామేశ్వరం, ఓంకారేశ్వరం, మహాబలేశ్వర్, ఉడిపి, గోకర్ణ, కాట్మండ్, నాసిక్, శ్రీనగర్ తదితర పుణ్యక్షేత్రాల పునరుద్ధరణకి సహకరించిన మహా గొప్ప పవిత్రమూర్తి అని ఆమె సేవలను కొనియాడారు. ఆమె జయంతి వేడుకలను శ్రీశైలంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, మహాపుణ్యక్షేత్రంలో జరుపుకోవడం క్షేత్ర ప్రజల అదృష్టమని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ నాయకురాలు కొంపల్లి మాధవిలత, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, బీజేపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు, బుడ్డా శ్రీకాంత్రెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ ఇన్చార్జి మోమిన్ షబానా, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అరవింద్రెడ్డి, మండల అధ్యక్షుడు చదువుల శ్రీను, నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.