
అహోబిలేశా.. బీ ట్యాక్స్ కట్టలేము!
● పుణ్యక్షేత్రంలో ఆగని పచ్చ దందా ● నాలుగు నెలల క్రితం వంద లాడ్జీల నిర్వాహకులతో మామూళ్ల ఒప్పందం ● మాట వినని 17 లాడ్జీల యజమానులపై అధికారులతో వేధింపులు ● ప్రస్తుతం కప్పం కట్టిన ముగ్గురికి మినహాయింపు ● అనుమతులు లేవంటూ 14 లాడ్జీలు కూల్చేస్తామని నోటీసులు
సాక్షి టాస్క్ ఫోర్స్: ఇందుగలడందు లేడని సందేహం వలదు... ఎందెందు వెతికినా.. అందందే తమ అవినీతి, అక్రమ సంపాదన అన్న చందంగా మారింది.. ఆళ్లగడ్డలో నియోజకవర్గంలో అధికార పార్టీనేతల దందా. అభివృద్ధి పనుల్లో పర్సెంటేజీల పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న అధికార పార్టీ ముఖ్యనేత ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో లాడ్జీలనూ వదలడం లేదు. ఎవరికీ అనుమతులు లేవు అంటూ.. పంచాయతీరాజ్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ శాఖల అధికారులతో నెలల తరబడి వేధింపులకు పాల్పడి వసూళ్ల దందాకు తెరలేపారు. కొందరు తమ వల్ల కాదని చేతులెత్తేశారు. దీంతో 14 లాడ్జీలు కూల్చి వేస్తామని నిర్వాహకులకు నోటీసులు ఇవ్వడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అహోబిలంలో చిన్న, పెద్ద లాడ్జీలు, సత్రాలు సుమారు 100 వరకు నిర్మించుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు. వీటిపై అధికార పార్టీ ముఖ్యనేత కన్నుపడటంతో వెంటనే వసూళ్ల బాధ్యత ఓ తమ్ముడికి అప్పగించారు. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం నిర్మించుకున్న వాటికి నోటీసులు ఇచ్చి బెదిరించారు. ఇదేమిటనీ ప్రశ్నిస్తే ‘అన్న’ దగ్గరకు వెళ్లి ఎంతో కొంత ఇస్తామని మాట్లాడుకోమని సలహా ఇచ్చారు. అయినా ఎవరూ స్పందించక పోవడంతో ఇవన్నీ కాలువపై ఉన్నాయి.. అని ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ ఆధీనంలో ఉన్న పొలంలో కట్టారని తహసీల్దార్, సర్వేయర్ ఇలా అన్ని శాఖల అధికారులతో సర్వే చేయించారు. భయపడిన చాలా మంది మామూళ్లు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే 17 లాడ్జీల నిర్వాహకులు కప్పం కట్టేందుకు ముందుకు రాక పోవడంతో విద్యుత్ అధికారులను పంపించి దౌర్జన్యంగా కరెంట్ కట్ చేయించారు. దీంతో ఆందోళన చెందిన మరో ముగ్గురు వెళ్లి బీ ట్యాక్స్ కట్టారు. ఇక మిగిలింది 14 మందికి ‘మీ లాడ్జీలను కూల్చి వేస్తామని’ అంటూ మంగళవారం మరోమారు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశం అయింది. ఇదేంటి మొన్నటి దాక 17 లాడ్జీలు అన్నారు. ఇప్పుడు 14 ..ఎందు కు అని అధికారులను ఆరా తీయగా..ఆ ము గ్గురు బీ ట్యాక్స్ కట్టా రు.. మీరు కట్టేయండి అంటూ ఉచిత సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ కథనం సాక్షిలో ప్రచురితమైంది. అహోబిలం క్షేత్రంలో అనుమతులు లేని లాడ్జీలపై వార్తా కథనం ఇది. ఆ తర్వాత ఈ లాడ్జీలకు అనుమతి లేదని కరెంట్ కట్ చేస్తున్నామని నోటీసులు ఇచ్చారు. అయినా స్పందించక పోవడంతో కరెంట్ కట్ చేశారు. అయితే ఇప్పుడు వీరభద్ర, వేదపాఠశాల, సుదర్శన్ కాంప్లెక్స్ అనే మూడు లాడ్జీలకు నోటీసులు ఇవ్వక పోవడంతో ఆ లాడ్జీల నిర్వాహకులు పెద్ద మొత్తంలో బీ ట్యాక్స్ కట్టారని, అందుకే అవి సక్రమమయ్యా యని గుసగుసలాడుకుంటున్నారు.
డబ్బులు ఇస్తాం.. క్రమబద్ధీకరిస్తారా ?
అహోబిలంలో ప్రభుత్వ భూములు ఉన్నాయి. నిర్మాణాలకు చాలా వాటికి అనుమతులు లేవు. అధికార పార్టీ నేతలు రూ. లక్షలు డబ్బులు ఇవ్వండి అని బెదిరిస్తున్నారు. ఇప్పుడు ఇస్తాం. మరో నెలకో ఏడాదికో వచ్చి మళ్లీ అక్రమ నిర్మాణాలే కదా డబ్బులు ఇవ్వమంటే ఎలా? అడిగినంత డబ్బులు ఇస్తాం.. అన్ని క్రమబద్ధీకరణ చేసి ధ్రువీకరణ పత్రాలు ఇస్తారా చెప్పండి. లేకుంటే వారికి ఎప్పుడు డబ్బులు అవసరమైతే అప్పుడు వచ్చి కప్పం కట్టాలని బెదిరిస్తే ఏం చేయాలి. – లాడ్జీ యజమాని
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు..
నేను కొత్తగా ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్నా. గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు. ప్రస్తుతం 14 మందికి నోటీసులు ఇవ్వమని ఈఓపీఆర్డీ ఆదేశాలు ఇవ్వడంతో వారికి మాత్రమే నోటీసులు ఇవ్వడం జరిగింది.
– సుదర్శన్రెడ్డి, పంచాయతీ సెక్రటరీ

అహోబిలేశా.. బీ ట్యాక్స్ కట్టలేము!