
ప్రకృతి వ్యవసాయం రైతుకు లాభదాయకం
నంద్యాల(అర్బన్): ఎరువులు, పురుగు మందులు వాడకం తగ్గించి ప్రకృతి వ్యవసాయం చేస్తే రైతుకు లాభదాయకమని జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ తెలిపారు. యాగంటిపల్లె కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం నంద్యాల మండలం అయ్యలూరు, పెద్దకొట్టాల గ్రామాల్లో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన డీఏఓ మురళీ కృష్ణ మాట్లాడుతూ ఈ ఏడాది ముందస్తు వర్షాలు కురుస్తుండటంతో పచ్చిరొట్ట ఎరువులు వాడాలని, దీని ద్వారా భూమిలో కర్బన శాతం పెరిగి నేల సారవంతమవుతుందన్నారు. కేవీకే కో ఆర్డినేటర్ ధనలక్ష్మి మాట్లాడుతూ భూ సార పరీక్షలు చేయించుకోవడం ద్వారా నేల సారవంతాన్ని బట్టి పురుగు మందులు వాడవచ్చన్నారు. శాస్త్రవేత్త సుధాకర్ మాట్లాడుతూ రైతులు సాలువరి సాగు చేపట్టి సేద్యపు ఖర్చులు తగ్గించుకోవాలన్నారు. వరిలో ఎన్డీఎల్ఆర్–7, ఆర్ఎన్ఆర్ రకాలు ఖరీఫ్ సాగుకు అనువైనవన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి నాగరాజు, మండల ఏఓ ప్రసాదరావు, శ్రీధర్, బీటీఎం ఉమామహేశ్వరి, ఏఈఓలు ముక్తార్బాషా తదితరులు పాల్గొన్నారు.