పిడికిలి బిగించి.. వెన్నుపోటుపై గర్జించి! | - | Sakshi
Sakshi News home page

పిడికిలి బిగించి.. వెన్నుపోటుపై గర్జించి!

Jun 5 2025 10:39 AM | Updated on Jun 5 2025 2:20 PM

Nadyala YSRCP Rally

కల్లూరులో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు

టీడీపీ ‘సూపర్‌’ మోసాలపై జనాగ్రహం

‘సీఎం డౌన్‌..డౌన్‌’ అనే నినాదాలతో దద్దరిల్లిన జిల్లా

వైఎస్సార్‌సీపీ ‘వెన్నుపోటు దిన’ నిరసనకు భారీ స్పందన

ఆందోళనకు మద్దతు తెలిపిన అన్ని వర్గాల ప్రజలు

పోలీసులు అడ్డకున్నా భయపడని మహిళలు

పట్టణాల్లో భారీ ర్యాలీల నిర్వహణ

అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన వైఎస్సార్‌సీపీ నేతలు

కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజా వ్యతిరేకత మిన్నంటింది. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’లో నిరసన హోరెత్తింది. ‘సీఎం డౌన్‌..డౌన్‌’ అనే నినాదం గర్జించింది. ‘బాబు.. ఈ పాలన మాకొద్దు.. వెంటనే దిగిపోండి’ అనే ఆగ్రహం పెల్లుబికింది. విద్యార్థులు, రైతులు, కార్మికులు, మహిళలు, కుల వృత్తులు చేసేవారు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు కదం తొక్కారు. పిడికిలి బిగించి తమ ఆ‘వేదన’ను ప్రదర్శించారు.

బొమ్మలసత్రం: ‘సూపర్‌సిక్స్‌’తో పాటు వందలాది వాగ్దానాలు ఇచ్చి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా హామీలు అమలు చేయలేదు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం ‘వెన్నుపోటు దిన నిరసన’ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాలకు అన్ని వర్గాలకు చెందిన ప్రజలు మద్దతు తెలిపారు. వలంటరీలు కూడా పిడికిలి బిగించి ఉద్యమంలో చేతులు కలిపారు. అన్నదాత సుఖీభవ పేరుతో ప్రభుత్వం ఇస్తానన్న రూ. 20 వేలు తక్షణమే చెల్లించాలని అన్నదాతలు డిమాండ్‌ చేశారు. భారీ సంఖ్యలో ర్యాలీగా వెళ్లి అధికారులకు వైఎస్సార్‌సీపీ నేతలు వినతి పత్రాలు అందించారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వెంటనే హామీలు నెరవేర్చేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రాల్లో పేర్కొన్నారు.

అడ్డంకులను అధిగమించి..

నంద్యాల జిల్లా కేంద్రంలో స్థానిక ఉదయానంద రెసిడెన్సీ నుంచి పార్టీ కార్యకర్తలు, రైతులు, వలంటీర్లు, న్యాయవాదులు చేపట్టిన ర్యాలీకి పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. భారీ సంఖ్యలో ప్రజలు రావడంతో పోలీసులు కలెక్టరేట్‌కు గేటువేశారు. కలెక్టర్‌ కార్యాలయంలోకి ఇంత మందిని అనుమంతించేది లేదని త్రీటౌన్‌ సీఐ కంబగిరిరాముడు ప్రజలను నివారించారు. అయినప్పటికీ పోలీసులను, గేటును తోసుకుని ప్రజలు ముందుకు వెళ్లారు. సీఐ వెంటనే రోప్‌పార్టీని పురమాయించి మరో మారు లోనికి వెళ్లిన వారిని అడ్డుకుని కేవలం 10 మందిని మాత్రమే అనుమతించారు. ప్రభుత్వంపై ప్రజలకున్న వ్యతిరేకతను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా పోలీసులు అడ్డుపడటాన్ని సామాన్యులు తప్పుపడుతున్నారు.

జిల్లా వ్యాప్తంగా భారీ స్పందన..

వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వెన్నుపోటు దిన నిరసన’ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా భారీ స్పందన వచ్చింది. అన్ని చోట్లా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం డౌన్‌..డౌన్‌ అనే ప్లకార్డులను ప్రదర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు పాలన సరిగ్గా లేదని కొందరు ఆరోపించారు. హామీలను వెంటనే అమలు చేయాలని, లేదంటే పదవి నుంచి దిగిపోవాలని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిరసనలు ఇలా..

● నంద్యాలలో ఉదయానంద రెసిడెన్సీ నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జేసీ విష్ణుచరణ్‌కు వినతి పత్రం అందించారు. పార్లమెంట్‌ పరిశీలకురాలు, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ మాబున్నిసా, వైస్‌ చైర్మన్‌ గంగిశెట్టి శ్రీధర్‌ , రాష్ట్రమార్క్‌ఫెడ్‌ మాజీ చైర్మన్‌ పీపీ నాగిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు దాల్మిల్‌ అమీర్‌ పాల్గొన్నారు.

● ఆత్మకూరులో మాజీ ఎమ్యెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో భారీ జనసందోహంతో ర్యాలీ నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్‌కు వనతిపత్రం అందించారు. నేతలు భువనేశ్వరరెడ్డి, అహమ్మద్‌ వుసేన్‌, నాయకులు శివారెడ్డి, రాజమోహన్‌రెడ్డి, అంజాద్‌ఆలీ పాల్గొన్నారు.

● బనగానపల్లిలో మాజీ ఎమ్యెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లాపరిషత్‌ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి, మండలాధ్యక్షులు పోచా రమాదేవి, భీమిరెడ్డి రమాదేవి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రా హర్షవర్ధన్‌రెడ్డి తదితర నాయకులు, అభిమానులతో ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున ప్రజలతో ర్యాలీగా తహసీల్ధార్‌ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందజేశారు.

● డోన్‌లో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున జనసందోహంతో ర్యాలీగా వెళ్లి అక్కడ అధికారులకు వినతి పత్రం అందించారు.

● ఆళ్లగడ్డలో మాజీ ఎమ్యెల్యే గంగుల బిజేంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నేత భూమా కిషోర్‌రెడ్డి, నాయకులు గంధం రాఘవరెడ్డి, బాబులాల్‌ పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి తహసీల్ధార్‌ రత్నకుమారికి వినతి పత్రం అందించారు.

● నందికొట్కూరులో పార్టీ నేత డాక్టర్‌ ధారా సుధీర్‌ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జెడ్పీటీసీ సభ్యులు జగదీశ్వరరెడ్డి, సోముల సుధాకర్‌రెడ్డి, నాయకులు శివరామకృష్ణారెడ్డి, రమేష్‌నాయుడు, ఓబులేసు, నాగిరెడ్డి తదితరులు హాజరయ్యారు.

అభివృద్ధి విధ్వంసకులు

టీడీపీ నేతలు అభివృద్ధి విధ్వంసకులుగా మారారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదు. డోన్‌ను కర్నూలు జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చి మరచిపోయారు. ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామాన్ని మండల కేంద్రంగా మారుస్తామని మాయమాటలు చెప్పారు. ప్రతి కుటుంబానికి 3 సెంట్ల ఇంటి స్థలం ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉంది. పాణ్యం సిమెంట్‌ ఫ్యాక్టరీని మూతవేసే స్థితికి టిడిపి నాయకులు దిగజారారు. ఇలాంటి వారికి ప్రజలు బుద్ధిచెప్పాలి.

– మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

ప్రజలు ఎలా బతకాలి?

సూపర్‌ సిక్స్‌ పథకాలను కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. ప్రజలకు వెన్నుపోటు పొడిచి ఎలా అధికారంలో ఉంటారు? మహిళలు, రైతులు విద్యార్థులు, వ్యాపారలు, నిరుద్యోగులు , ఉద్యోగులు..ఇలా అన్ని రంగాల వారిని తీవ్ర అసంతృప్తికి గురిచేశారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అసలు లేవు. ప్రజలు ఎలా బతకాలి? – ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి

వెన్నుపోటు చంద్రబాబు నైజం

రాజకీయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నీతి నిజాయితీగా గెలిచిన దాఖలాలు లేవు. వెన్నుపోటు ఆయన నైజం. స్వార్థరాజకీయాల కోసమే రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలి. లేదంటే ప్రజల తరఫున పోరాటాలు తీవ్రం చేస్తాం.

– ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా

పాలనంతా అరాచకమే!

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి

కర్నూలు(సెంట్రల్‌): రాష్ట్రంలో ‘కూటమి’ ఏడాది పాలనంతా అరాచకమేనని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆరోపించారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి తరఫున వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందని తెలిపారు. కల్లూరు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బుధవారం ‘వెన్నుపోటు దిన నిరసన’ నిర్వహించారు. తహసీల్దార్‌ ఆంజనేయులకు వినతిపత్రం సమర్పించారు. అంతకు ముందు కాటసాని ఇంటి నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ..రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. పోలీసులు టీడీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ .. ఊరూరా మద్యాన్ని తెచ్చి మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని విమర్శించారు. టీడీపీ నాయకులు ఇసుకను కొల్లగొడుతున్నారని విమర్శించారు.

కర్నూలు మేయర్‌ బీవై రామయ్య మాట్లాడుతూ.. కూటమి ఏడాది పాలనంతా అరాచకాలతో సరిపోయిందనన్నారు. డిప్యూటీ మేయర్‌ రేణుకారెడ్డి సిద్ధారెడ్డి, మైనార్టీ నాయకులు యూనస్‌బాషా మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో భంగపాటు తప్పదన్నారు. కార్పొరేటర్లు లక్ష్మణ్‌, అరుణకుమారి, లక్ష్మీకాంతరెడ్డి, నారాయనరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, చిట్టెమ్మ, సాన శ్రీనివాసులు, నరసింహులు, ఎరుకల వెంకటేశ్వర్లు, శ్వేతారెడ్డి, జెడ్పీటీసీ సభభ్యుడు చంద్రారెడ్డి, రంగమునిగౌడ్‌, ఎంపీపీలు శారద,తిప్పన్న, నాగమద్దమ్మ, ఉసేన్‌, పార్టీ నాయకుల అంబాల ప్రభాకరరెడ్డి, బెల్లం మహేశ్వరరెడ్డి, నల్లబోతుల గోపాల్‌రెడ్డి, అక్కిమి అనుమంతరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement