
సీమ ప్రాజెక్ట్లపై ‘కూటమి’ కపట ప్రేమ
కొత్తపల్లి: రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వానిది కపట ప్రేమ అని, ఏడాదైనా ఒక్క ప్రాజెక్ట్ను కూడా పట్టించుకోలేదని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి విమర్శించారు. శనివారం సంగమేశ్వరం వద్ద సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన 9వ వార్షికోత్సవం సందర్భంగా బహిరంగ సభ నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్ కేంద్రంగా పరిపాలన చేయకుండా అమరావతి కేంద్రంగా నిధులన్నీ అక్కడే ఖర్చుపెట్టడంతో రాష్ట్రం దివాలా తీసిందని, ఇందుకు చంద్రబాబు కారణమన్నారు. ఏపీ అంటే అమరాతి, పోలవరం మాత్రమే కాదని రాయలసీమ కూడా అందులో భాగమేనన్నారు. రాయలసీమలో ప్రతి ఎకరానికి నీరు ఇస్తామని, అందుకు తగ్గట్లుగా బ్లూ ప్రింట్ తయారు చేసామని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమ దగ్గర వున్న ఆ బ్లూ ప్రింట్ ద్వారా ఏ విధంగా నీళ్లు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు కోసం వేలాది భూములను త్యాగం చేసిన నిర్వాసితులను ఇప్పటి వరకు పట్టించుకోలేదన్నారు. పట్టిసీమ పూర్తి చేసి రాయలసీమకు నీళ్లు ఇస్తామని చెప్పిన చంద్రబాబు అది మరచి నేడు గోదావరి – బానకచర్ల అంటూ మరో కొత్త నాటకానికి తెరలేపడం ఈ ప్రాంత ప్రజలను మోసం చేసే ప్రయత్నమేనన్నారు. సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులకు నిధులు లేవంటున్న అమరావతి ప్రాంతంలో ఐకానిక్ టవర్ల కోసం వేలాదికోట్లు ఎలా ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం మోసాన్ని ప్రతి గడపకు వెళ్లి ఎండగడతామన్నారు. కార్యక్రమంలో సామాజిక రాయలసీమ వేదిక కన్వీ నర్ డాక్టర్ నాగన్న, విరసం నాయకులు వరలక్ష్మి, పినాకపాణి, అనంతపురం ఓపీడీఆర్ రామ్ కుమార్, భారతీయ కిసాన్ సంఘ్ వైఎస్సార్ కడప జిల్లా నాయకులు వెల్లాల సహదేవరెడ్డి, సీపీఎం నాయకుడు రాజశేఖర్, మహిళా హక్కుల వేదిక నాయకులు మణెమ్మ, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక నాయకులు రామకృష్ణారెడ్డి, జానోజాగో నాయకులు మహబూబ్ బాషా, యాగంటి బసవేశ్వర తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రం దివాలాకు చంద్రబాబే కారణం
పట్టిసీమతో నీళ్లు ఇస్తామని
బానకచర్ల నాటకాలెందుకు ?
రాయలసీమ సాగునీటి సాధన సమితి
అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి