
మద్దిలేటయ్య కిటకిట
బేతంచెర్ల: మద్దిలేటి నరసింహ స్వామి ఆలయం శనివారం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. వేసవి సెలవులు కావడంతో జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. పంచామృతాభిషేకం, కుంమార్చన, ఆకుపూజ, స్వామి వారికి ప్రీతి పాత్రమైన వరపూజతో పాటు మహా మంగళహారతి నిర్వహించారు.
శేషజీవితాన్ని
ప్రశాంతంగా గడపాలి
● ఎస్పీ అధిరాజ్సింగ్ రాణా
బొమ్మలసత్రం: పోలీస్శాఖలో పనిచేసి పదవీవిరమణ పొందిన ఉద్యోగులు తమ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడపాలని జిల్లా ఎస్పీ అధిరాజ్సింగ్రాణా అన్నారు. శనివారం స్థానిక కార్యాలయంలో పదవీ విరమణ పొందిన నంద్యాల ట్రాఫిక్ ఎస్ఐ లక్ష్మయ్య, డీసీఆర్బీ ఎస్ఐ శంకర్రావు, ఏఆర్ హెడ్కానిస్టేబుల్ జగన్మోహన్రెడ్డిని ఎస్పీ సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పోలీస్శాఖ నుంచి పొందాల్సిన బెనిఫిట్స్ త్వరగా అందేలా చూస్తామన్నారు. ఎప్పుడు తమతో అవసరమున్నా నేరుగా కార్యాలయానికి వచ్చి సమస్యలు విన్నవించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా సాయుధ బలగాల అడిషనల్ ఎస్పీ చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
నంద్యాల(అర్బన్): ఆచార్య ఎన్జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నంద్యాల వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల కోర్సుల్లో చేరేందుకు పదవ తరగతి పాస్ అయిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏడీఆర్ జాన్సన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 28 నుంచి జూన్ 16వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. www. angrau.ac.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల కార్యాలయాన్ని (9989625208)ను సంప్రదించాలన్నారు.
శ్రీశైలం డ్యాం నీటిమట్టం 828.20 అడుగులు
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయ నీటిమట్టం శనివారం సాయంత్రం సమయానికి 828.20 అడుగులకు చేరుకుంది. జలాశయంలో 47.7648 టిఎంసీల నీరు నిల్వ ఉంది. శుక్రవారం నుంచి శనివారం వరకు జూరాల, సుంకేసుల ప్రాజెక్ట్ల నుంచి శ్రీశైలానికి 74,135 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. దిగువ ప్రాజెక్ట్లకు 2,149 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో 0.291 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో 0.484 మిలియన్ యూట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్కు 1,733 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతలకు 416 క్యూసెక్కులను వదిలారు.
మే నెలలో 165 శాతం అధిక వర్షాలు
కర్నూలు(అగ్రికల్చర్): గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి మే నెలలో అధిక వర్షాలు కురిశారు. మే నెల మొత్తం వేసవి ఉంటుంది. వేసవిలో కురిసే వర్షాలను ఆన్ సీజనల్గా వ్యవహరిస్తారు. అలాంటిది అన్ని మండలాల్లో వర్షాలు పడటంతో వేసవి తీవ్రత ఈ సారి పెద్దగా కనిపించలేదు. మామూలుగా అయితే రోహిణి కార్తెలో వేసవి తీవ్రత ఎక్కువగా ఉండాలి. ఈ సారి రోహిణి కార్తె చల్లదనం పంచింది. 2024 వేసవిలో రికార్డు స్థాయిలో 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ వేసవిలో గరిష్టంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలే నమోదు కావడం గమనార్హం. మే నెల సాధారణ వర్షపాతం 40.1 మి.మీ ఉండగా 106.2 మి.మీ వర్షపాతం నమోదైంది. అంటే 165 శాతం అధిక వర్షం కురిసింది. జూన్ 1 నుంచి ఖరీఫ్ సీజన్ మొదలు కానుంది. జూన్ నెల సాధారణ వర్షపాతం 77.7 మి.మీ. ఉంది. మే నెలలో మురిపించిన వర్షాలు జూన్లో ఏ స్థాయిలో మెరిపిస్తాయనేది వేచి చూడాల్సిందే.

మద్దిలేటయ్య కిటకిట