
సెంటిమెంట్ పండింది
● అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోళ్లకు పోటెత్తిన జనాలు ● ఉమ్మడి జిల్లాలో దాదాపు రూ.250 కోట్ల మేర అమ్మకాలు? ● వివాహాలు ఉండటంతో పెరిగిన కొనుగోళ్లు
కర్నూలు(అగ్రికల్చర్): సెంటిమెంటు పండింది. అక్షయ తృతీయను పురస్కరించుకుని బుధవారం బంగారం కొనుగోలు చేసేందుకు వినియోగదారులకు దుకాణాలకు పోటెత్తారు. కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్ తదితర పట్టణాల్లో కొనుగోలుదారులతో బంగారం దుకాణాలు కిటకిటలాడాయి. ఉదయం 9 గంటలకే బంగారం దుకాణాలు తెరుచుకున్నాయి. రాత్రి ప్రొద్దుపోయే వరకు జనాల రద్దీ తగ్గలేదు. ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా మొత్తం మీద దాదాపు రూ.250 కోట్ల వ్యాపారం జరిగి ఉంటందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కార్పొరేట్ జ్యువెలరీ సంస్థలు 10 రోజులుగా ఆఫర్ల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాయి. గత ఏడాది అక్షయ తృతీయ రోజున 10 గ్రాముల బంగారం ధర రూ.73,240గా ఉంది. ఈ అక్షయ తృతీయ నాటికి 22 క్యారెట్ల బంగారం ధర రూ.89,800, 24 క్యారెట్ల ధర రూ.97,960కి చేరాయి. ఈ ధరపై తరుగు పేరుతో డిజైన్ బట్టి 6 నుంచి 22 శాతం సొమ్ము అదనంగా రాబట్టినట్లు స్పష్టమవుతోంది. మే నెలలో వివాహాది శుభకార్యాలు ఉండటంతో అక్షయ తృతీయ అమ్మకాలు జోరుగా జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోళ్లు పెరిగినట్లు తెలుస్తోంది. ఈ రోజున బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మీదేవిని ఇంటిలోకి ఆహ్వానించినట్లే అన్న సెంటిమెంటు కూడా బాగా కనిపించింది. కార్పొరేట్ బంగారం దుకాణ సంస్థలు అక్షయ తృతీయ ఆఫర్ల పేరుతో పెద్ద ఎత్తున చేసుకున్న ప్రచారం గ్రామీణ ప్రాంతాల ప్రజల్లోకి కూడా వెళ్లడంతో కొనుగోళ్లు కొంత పెరిగినట్లు తెలుస్తోంది.