
గాలివానకు వణికిన రైతు
కర్నూలు(అగ్రికల్చర్)/ఆళ్లగడ్డ: ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలుచోట్ల ఆదివారం సాయంత్రం గాలు లు, మెరుపులతో వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో చేతికొచ్చిన పంటలు వర్షానికి తడిచి, పైర్లు నేలవాలడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. జూపాడుబంగ్లా మండలంలో 33.75, పాములపాడు మండలంలో 28.5, వెల్దుర్తి మండలంలో 21.0, నందికొట్కూరులో 16.5, గూడూరులో 13.5 మి.మీ ప్రకారం వర్షపాతం నమోదైంది. కర్నూలు నగరంలో సాయంత్రానికి ఒక మోస్తరు వర్షం పడటంతో వాతావరణం చల్లబడింది. పెనుగాలుల తీవ్రతకు పలుచోట్ల తోటల్లోని మామిడి చెట్లు నేలమట్టమయ్యాయి. మామిడి రైతుకు నష్టం వాటిల్లింది. రుద్రవరం మండలం ఆలమూరులో సాగుచేసిన బొప్పాయి పంటంతా విరిగి నేలవాలడంతో రైతులకు తీవ్రనష్టం వాటిల్లింది. కల్లాల్లో ఆరబెట్టిన వరి ధాన్యం, మిరప, పసుపు దిగుబడులు వర్షానికి తడిచిపోయాయి. కొత్తపల్లి మండలంలో పలు చోట్ల గాలివానకు భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పగిడ్యాల మండలం ప్రాతకోటలో భారీ వర్షానికి ముస్లిం కాలనీ జలమయమైంది.