ముస్లింల ద్రోహి ఫరూక్‌ | - | Sakshi
Sakshi News home page

ముస్లింల ద్రోహి ఫరూక్‌

Apr 17 2025 1:15 AM | Updated on Apr 17 2025 1:15 AM

ముస్ల

ముస్లింల ద్రోహి ఫరూక్‌

నంద్యాల(అర్బన్‌): వక్ఫ్‌ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింలు ఆందోళనలు చేస్తుంటే రాష్ట్ర మంత్రి ఫరూక్‌ కనీస మద్దతు ఇవ్వడం లేదని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పారవిచంద్రకిశోర్‌రెడ్డి అన్నారు. వేలాది మంది ముస్లింలు ఓట్లు వేస్తే గెలిచి దొంగ బుద్ధితో వారిని రోడ్లపైకి లాక్కొచ్చారని మండిపడ్డారు. ముస్లింల ద్రోహిగా మంత్రి ఫరూక్‌ మిగిలారని విమర్శించారు. వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా రోడ్లెక్కి ముస్లింలు పోరాటం చేస్తుంటే ఏసీ రూముల్లో కూర్చొని వైఎస్సార్‌సీపీ చేపట్టే నిరసన సభలకు వెళ్లవద్దంటూ ఆదేశాలు జారీ చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. పదవులను కాపాడుకోవడానికి ప్రాధాన్యతను ఇస్తున్న మంత్రి చర్యలను ఖండించాలన్నారు. ముస్లింలకు ఎలాంటి కష్టాలు వచ్చినా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వక్ఫ్‌ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీసుబ్బారెడ్డి మాట్లాడారని.. ఆ వీడియోను ముస్లింలకు చూపించారు. బిల్లుకు రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ మద్దతు ఇచ్చిందంటూ ‘కూటమి’ పార్టీలు గ్లోబల్స్‌ ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. ముస్లింలకు వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు.

నంద్యాలలో భారీ ప్రదర్శన

కేంద్ర ప్రభుత్వం మొండిగా అమలులోకి తెచ్చిన వక్ఫ్‌ సవరణ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించబోమంటూ నంద్యాల ముస్లింలు గర్జించారు. వక్ఫ్‌ బోర్డు సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం నంద్యాల పట్టణం గాంధీచౌక్‌లో భారీ ప్రదర్శన నిర్వహించారు. వక్ఫ్‌ సవరణ చట్టానికి మద్దతు ఇచ్చిన టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గాంధీ బొమ్మ సెంటర్‌ను దిగ్బంధించారు.

టీడీపీని ముస్లింలు నమ్మరు

ముస్లింలకు నష్టం కలిగించే వక్ఫ్‌ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్సీ ఇసాక్‌ బాషా అన్నారు. మైనార్టీలకు మంచి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన టీడీపీని ముస్లింలు నమ్మబోరన్నారు. చంద్రబాబు మెప్పు కోసమే ముస్లింలకు మంత్రి ఫరూక్‌ మద్దతు ఇవ్వడం లేదని ఆరోపించారు.

న్యాయం చేయాలి

వక్ఫ్‌ సవరణ చట్టాన్ని వెంటనే వెనక్కు తీసుకుని ముస్లింలకు న్యాయం చేయాలని నంద్యాల ముస్లిం జేఏసీ గౌరవాధ్యక్షులు మహమ్మద్‌ అబులైజ్‌ అన్నారు. 11మంది ముస్లిం సభ్యులు ఉండాల్సిన సెంట్రల్‌ వక్ఫ్‌ కౌన్సిల్లో ఏడుగురు ముస్లిమేతరులు ఉండటం దారుణమన్నారు.

‘కూటమి’కి ఓటమి తప్పదు

వక్ఫ్‌ సవరణ చట్టానికి ఆమోదం తెలిపిన రాష్ట్రంలోని ‘కూటమి’ ప్రభుత్వానికి ఓటమి తప్పదని నంద్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మాబున్నిసా అన్నారు. సెంట్రల్‌ వక్ఫ్‌ కౌన్సిల్‌ చట్టంలో ఏడుగురు ముస్లిమేతరులను పెట్టడం అన్యాయమన్నారు. ముస్లింల సునామీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొట్టుకొని పోతాయని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు దాల్‌మిల్‌ అమీర్‌బాషా, డాక్టర్‌ శశికళారెడ్డి, రసూల్‌ ఆజాద్‌, ముస్లిం, క్రిస్టియన్‌ జేఏసీ, ఎంఐఎం, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, మైనార్టీ కౌన్సిలర్లు, వార్డు ఇన్‌చార్జ్‌లు పాల్గొన్నారు.

ముస్లింలతో కిక్కిరిసిన

గాంధీచౌక్‌

పదవులను కాపాడుకోవడానికే

ప్రాధాన్యత ఇస్తున్నారు

వక్ఫ్‌ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా

ఎప్పుడైనా మాట్లాడారా?

ముస్లిం ఓట్లతో గెలిచి

ఆందోళనకు మద్దతు ఇవ్వరా?

నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి

మైనార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయాలి..

వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఎండలను సైతం లెక్కచేయకుండా రోడ్లెక్కి న్యాయ పోరాటం చేస్తున్నామని ఎస్‌డీపీఐ పట్టణ అధ్యక్షుడు ఎజాస్‌ హుసేన్‌ అన్నారు. రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీ ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రులు రాజీనామా చేయాలని కోరారు. మైనార్టీలకు వెన్నుపోటు పొడిచిన టీడీపీకి ఏ ఎన్నికల్లోనూ ఓట్లు పడకుండా చూస్తామన్నారు.

ఆ రెండు పార్టీలు చేటు చేశాయి..

వక్ఫ్‌ సవరణ చట్టానికి మద్దతు ఇచ్చిన రాష్ట్రంలోని టీడీపీ, జనసేన పార్టీలు ముస్లింలకు చాలా చేటు చేశాయని నంద్యాల ముస్లిం జేఏసీ కార్యదర్శి అబ్దుల్‌సమ్మద్‌ విమర్శించారు. ఆ పార్టీ వారిని ముస్లింల గుండెల నుంచి శాశ్వతంగా తొలగించాలన్నారు. ముస్లిం సమాజానికి ద్రోహం చేసే వక్ఫ్‌ సవరణ చట్టానికి టీడీపీ, జనసేన పార్టీలు మద్దతు పలకడాన్ని ప్రతి ముస్లిం తప్పుబడుతున్నారన్నారు.

ముస్లింల ద్రోహి ఫరూక్‌1
1/2

ముస్లింల ద్రోహి ఫరూక్‌

ముస్లింల ద్రోహి ఫరూక్‌2
2/2

ముస్లింల ద్రోహి ఫరూక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement