నకిరేకల్ : వేసవిలో వడదెబ్బ ప్రభావాన్ని తగ్గించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని, ప్రజలు కూడా తగు జాగ్రత్తలు పాటించాలని డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నకిరేకల్ మండలం నెల్లిబండలో వడదెబ్బతో శనివారం బుడిగె శంకరయ్య(60) మృతిచెందినట్లు ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైంది. దీనిపై ఆదివారం మండల వైద్యాధికారి పి.వెంకటేషం, సిబ్బంది శ్యాంసుందర్, శివాణి, లత నెల్లి బండను సందర్శించి శంకరయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారని తెలిపారు. శంకరయ్య మరణంపై ఆదివారం కలెక్టర్కు, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్కు నివేదిక సమర్పించామని, ఆయన వడదెబ్బతోనే మృతి చెందినట్లు అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. వడదెబ్బ నుంచి ప్రజలు రక్షణ పొందేలా.. వైద్య ఆరోగ్య సిబ్బంది ఇప్పటికే క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎండదెబ్బ లక్షణాలు ముందుగానే గుర్తించి సమీప ఆరోగ్య కేంద్రాలకు పంపే విధంగా జిల్లా వ్యాప్తంగా ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎండ దెబ్బను ఎదుర్కొనేందుకు అవసరమైన మందులను అందుబాటులో పెట్టామని వివరించారు. ప్రజలు ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలని, వృద్ధులు, రైతులు, కూలీలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఫ డీఎంహెచ్ఓ శ్రీనివాస్


