కోదాడరూరల్ : కోదాడ మండలం అడ్లూరులో సోమవారం నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండు వర్గాలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. గ్రామసభ ప్రారంభం కాగానే ఉప సర్పంచ్ ఉసిరికాయల శిరీష, కొందరు వార్డు సభ్యులు కలిసి ఇటీవల మంజూరైన నిధులతో గ్రామంలో ఎక్కడ పనిచేశారు, నిధులు ఎంత డ్రా చేశారని ప్రశ్నించారు. దీనిపై సర్పంచ్ గువ్వల శిరీష స్పందిస్తూ.. నిబంధనల ప్రకారమే పనులు చేశామని, పనులన్నింటికీ ఎంబీ రికార్డులు ఉన్నాయని, ఆ మేరకే నిధులు డ్రా చేశామని తెలిపారు. ఈ క్రమంలో మాటామాట పెరిగి రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కోదాడ రూరల్ పోలీసులు గ్రామానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోగా.. మొత్తం 10మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గోపాల్రెడ్డి తెలిపారు.
కర్రలతో దాడి చేసుకున్న రెండు వర్గాలు
10 మందిపై కేసు నమోదు


