రీకౌంటింగ్ కోసం ఆందోళన
ఫ నల్లగొండలోని కౌంటింగ్ కేంద్రం వద్ద
పోలీసుల లాఠీఛార్జి
నల్లగొండ : మున్సిపల్ కార్పొరేషన్లో శుక్రవారం కౌంటింగ్ సందర్భంగా 14వ డివిజన్ ఓట్లను రీకౌంటింగ్ చేయాలని బీఆర్ఎస్ నాయకులు పట్టుబట్టారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి కూడా కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, భూపాల్రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగగా.. బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. 14వ డివిజన్లో మొదట బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారు. ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారు. దీంతో మున్సిపల్ మాజీ చైర్మన్ సైదిరెడ్డి రీకౌంటింగ్ చేయాలని పట్టుబట్టారు. దీంతో పోలీసులు సైదిరెడ్డిని పోలీస్ స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి తన అనుచరులతో కౌంటింగ్ కేంద్రం వద్దకు బయల్దేరారు. అయితే భూపాల్రెడ్డి కౌంటింగ్ కేంద్రానికి రాకుండా ఐటీ హబ్ వద్దనే పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. పోలీసులకు, భూపాల్రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేయగా.. పోలీసులు వారిపై లాఠీచార్జి చేశారు. భూపాల్రెడ్డితో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ అశోక్రెడ్డి మాట్లాడి ఈ ఘటనపై రిటర్నింగ్ ఆఫీసర్కు ఫిర్యాదు చేయాలని చెప్పి వెళ్లిపోయారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయంపై కోర్టుకు వెళ్లనున్నట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.


