
ఓటింగ్ యంత్రాల పరిశీలన
నల్లగొండ: కలెక్టరేట్ ఆవరణలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గోదాంను కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం అదనపు కలెక్టర్ శ్రీనివాస్, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. బందోబస్తు, భద్రత విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోదాంకు సీల్ వేయించారు. కలెక్టర్ వెంట కాంగ్రెస్ నుంచి అశోక్, బీఆర్ఎస్ నుంచి పిచ్చయ్య, బీఎస్పీ నుంచి యాదగిరి, బీజేపీ నుంచి లింగస్వామి, సీపీఎం నుంచి నర్సిరెడ్డి, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అన్సారీ, టీడీపీ నుంచి మల్లికార్జున్, కలెక్టర్ కార్యాలయ ఏఓ మోతీలాల్, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కృష్ణమూర్తి తదితరులున్నారు.
సిజేరియన్ల సంఖ్య తగ్గించాలి
జిల్లాలో శిశు మరణాలతో పాటు, సిజేరియన్ల సంఖ్య తగ్గించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శిశు మరణాలపై గురువారం నల్లగొండలోని ఉదయాదిత్య భవన్లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డీసీహెచ్ఎస్ డాక్టర్ మాతృనాయక్, జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారులు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్ వందన, డాక్టర్ అరుణకుమారి, జిల్లా సంక్షేమ అధికారిణి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ ఉపాధ్యాయులు 208 మంది
నల్లగొండ: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించిన 208 మందిని ఎంపిక చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి గురువారం తెలిపారు. వారిలో గెజిటెడ్ హెడ్మాస్టర్లు 16 మంది, స్కూల్ అసిస్టెంట్లు సమాన హోదా కలిగిన వారు 94, ఎస్జీటీలు, సమాన హోదా కలిగిన ఉపాధ్యాయులు 93 మంది, సీఆర్పీలు ఇద్దరు, ఒకేషనల్ విభాగంలో ముగ్గురిని ఎంపిక అయ్యారని పేర్కొన్నారు. వీరికి శుక్రవారం చిన వెంకట్రెడ్డి ఫంక్షన్ హాల్లో అవార్డులు అందించనున్నట్లు తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల సమస్యలకు టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు
నల్లగొండ: ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే రాష్ట్రస్థాయిలో సోమవారం నుంచి టోల్ ఫ్రీ నంబర్ 18005995991 అందుబాటులోకి వస్తుందని జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్ కుమార్ గురువారం తెలిపారు. లబ్ధిదారులు తమ ఇంటి బిల్లుల పరిస్థితి, ఇతర వివరాలను తెలుసుకునేందుకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన యాప్ను డౌన్లోడ్ చేసుకొని స్టేటస్ను పరిశీలించుకోవచ్చని పేర్కొన్నారు. ఫొటో క్యాప్చర్ విషయంలో పంచాయతీ కార్యదర్శులు ఇబ్బందులు సృష్టిస్తే లబ్ధిదారులు వారే తమ ఇళ్ల నిర్మాణ ఫొటోలను క్యాప్చర్ చేసి అప్లోడ్ చేయొచ్చని తెలిపారు.