
జీవన తాత్వికత తెలిసిన కవి మునాసు వెంకట్
రామగిరి(నల్లగొండ) : ప్రకృతితో మమేకమై జీవన తాత్వికతను తన కవిత్వంలో నేర్పుగా ఆవిష్కరించగల కవి మునాసు వెంకట్ అని ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. సృజన సాహితీ ఆధ్వర్యంలో ఆదివారం గుత్తా సుఖేందర్రెడ్డి నివాసంలో నల్లగొండకు చెందిన ప్రముఖ కవి మునాసు వెంకట్ రచించిన దాపు కవితా సంపుటి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో గోరటి వెంకన్న మాట్లాడారు. అస్తిత్వ ఉద్యమాల్లో దళిత బహుజన కవిత్వాన్ని సుసంపన్నం చేసిన కవుల్లో మునాసు వెంకట్ ముందు వరుసలో ఉంటాన్నారని అభిప్రాయపడ్డారు. దాపు కవిత్వ పుస్తకాన్ని డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి ఆవిష్కరించారు. డాక్టర్ బెల్లి యాదయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ విమర్శకులు అంబటి సురేంద్రరాజు, గుంటూరు లక్ష్మీనరసయ్య, డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి, సిద్ధార్థ, బైరెడ్డి కృష్ణారెడ్డి, డాక్టర్ తండు కృష్ణకౌండిన్య, భానుశ్రీకొత్వాల్, పెరుమాళ్ల ఆనంద్, అంబటి వెంకన్న, తుల శ్రీనివాస్, మేరెడ్డి యాదగిరిరెడ్డి, శీలం భద్రయ్య, బోధనం నర్సిరెడ్డి, పగడాల నాగేందర్, భూతం ముత్యాలు, సాగర్ల సత్తయ్య, కస్తూరి ప్రభాకర్, మాదగాని శంకరయ్య, బండారు శంకర్ తదితరులు పాల్గొన్నారు.