
మండలానికి 5 తగ్గకుండా
ఎంపీటీసీ స్థానాల పునర్విభజన
నేటి వరకు అభ్యంతరాలు స్వీకరణ
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రతి మండలంలో 5 ఎంపీటీసీ స్థానాలకు తగ్గకుండా పునర్వ్యవస్థీకరించి అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో ముసాయిదా జాబితా ప్రకటించారు. వాటిపై మంగళవారం అభ్యంతరాలను స్వీకరించారు. బుధవారం కూడా స్వీకరించనున్నారు. వచ్చిన అభ్యంతరాలను 10, 11 తేదీల్లో పరిష్కరిస్తారు. ఆ తరువాత అవసరమైన మార్పులు, చేర్పులతో 12వ తేదీన తుది ఎంపీటీసీ నియోజకవర్గాల జాబితాను ప్రకటిస్తారు.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఎంపీటీసీ స్థానాల పునర్విభజన ముసాయిదాను జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు జిల్లాలో మారనున్న ఎంపీటీసీ స్థానాల ముసాయిదా జాబితాను ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో నోటీసు బోర్డులో పెట్టింది. ప్రతి మండలంలో ఐదుకు తగ్గకుండా ఎంసీటీసీ స్థానాలు ఉండేలా ముసాయిదా సిద్ధం చేశారు. దీంతో నల్లగొండ జిల్లాలో ఐదు మండలాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. రెండు కొత్త మండలాల్లో ఐదు చొప్పున ఎంపీటీసీ స్థానాలను ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ ఆదేశాలు మేరకు మార్పులు
రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని మండలాలు పెరగడం, కొన్ని గ్రామాలు, నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు పెరగ్గా, కొన్నింటిని ప్రభుత్వం కుదించింది. దాంతో కొన్ని మండలాల్లో నాలుగు కంటే తక్కువగా ఎంపీటీసీ నియోజక వర్గాలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎంపీటీసీ (మండల ప్రాదేశిక నియోజక వర్గం) పునర్విభజనకు సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. ప్రతి మండలంలో ఐదు స్థానాలకు తగ్గకుండా ఉండేలా నియోజక వర్గాల పునర్విభజన చేయాలని పంచాయతీరాజ్ శాఖ చర్యలు చేపట్టింది. దాని ప్రకారం జిల్లాలో మంగళవారం అన్ని మండల పరిషత్లలో ఎంపీటీసీ ముసాయిదా జాబితాను ప్రచురించారు.
పెరిగిన మూడు ఎంపీటీసీలు
జిల్లాలో జిల్లాలో 3 ఎంపీటీసీ స్థానాలు పెరుగుతున్నాయి. వాటితో పాటు కొత్తగా 2 మండలాలు కూడా ఏర్పడ్డాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొన్ని మండలాల్లో ఎంపీటీసీ స్థానాలను తొలగించి కొత్త మండలాలకు కలిపారు. మరికొన్నింటిని సర్దుబాటు చేశారు. ఇంకొన్నింటిలో తగ్గించారు. 2019 ఎన్నికల సమయంలో 349 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ప్రస్తుతం 3 పెరిగాయి. దీంతో జిల్లాలో ఎంపీటీసీ స్థానాల సంఖ్య 352కి చేరుకుంది. అత్యధికంగా మిర్యాలగూడలో 19, నార్కట్పల్లిలో 15, చింతపల్లి, దామరచర్లలో 14 చొప్పున ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. మిగిలిన వాటిలో 12 నుంచి 5 తగ్గకుండా ఎంపీటీసీ స్థానాలున్నాయి.
ఎంపీటీసీ స్థానాల మార్పులు ఇలా..
● జిల్లాలోని చండూరు నుంచి కొత్తగా గట్టుప్పల్ మండలం ఏర్పడింది. చండూరు మండలంలో గతంలో 11 ఎంపీటీసీ స్థానాలుంటే వాటిల్లో 3 ఎంపీటీసీ స్థానాలైన గట్టుప్పల్–1, గట్టుప్పల్–2, తేరట్పల్లిని తొలగించి 8 స్థానాలకు పరిమితం చేశారు. ఆ మూడు ఎంపీటీసీలను గట్టుప్పల్ మండలంలో కలిపారు.
● మర్రిగూడ మండలంలో గతంలో 11 ఎంపీటీసీ స్థానాలుండగా అందులో ఒక ఎంపీటీసీ స్థానం అంతంపేటను మర్రిగూడ నుంచి తొలగించి గట్టుప్పల్ మండలంలో కలిపారు.
● మునుగోడు మండలంలోని వెల్మకన్నెను అక్కడి నుంచి తొలగించి, దానిని గట్టుప్పల్లో కలిపి ఐదు ఎంపీటీసీ స్థానాలను చేశారు.
● మునుగోడు మండలంనుంచి వెల్మకన్నెను తొలగించిన నేపథ్యంలో అంతకుముందు వెల్మకన్నె పరిధిలో ఉన్న చల్మెడ, పలివెల ఎంపీటీసీ స్థానం పరిధిలోని కోతులారంను కలిపి చల్మెడ ఎంపీటీసీ స్థానంగా మార్చి, గతంలో ఉన్నట్లుగానే 13 స్థానాలకు సర్దుబాటు చేశారు.
● చింతపల్లి మండలంలో 13 ఎంపీటీసీలు ఉండగా ఆ మండలంలో అదనంగా 1 ఎంపీటీసీ స్థానాన్ని పెంచింది. ఆ మండలంలోని గొడకొండ్ల కొత్తగా ఎంపీటీసీగా ఏర్పాటు చేయడంతో అక్కడ ఎంపీటీసీల సంఖ్య 14కు చేరింది.
● పీఏపల్లి మండలంలో గతంలో 14 ఎంపీటీసీ స్థానాలుంటే వాటిని పదికి కుదించారు. 4 ఎంపీటీసీ స్థానాలను గుడిపల్లి మండలంలో కలిపారు. గుడిపల్లిని కూడా కొత్తగా ఎంపీటీసీ నియోజక వర్గం ఏర్పాటు చేశారు.
● ఇంతకుముందు పీఏపల్లి పరిధిలో ఉన్న గుడిపల్లి, పోల్కంపల్లి, భీమనపల్లి, ఘనపురంను గుడిపల్లి ఎంపీటీసీలను మండల పరిఽధిలోకి తెచ్చారు. అలాగే అంగడిపేట ఎంపీటీసీ పరిధిలో ఉన్న చిల్కమర్రిని ఎంపీటీసీ స్థానంగా చేసి గుడిపల్లి పరిధిలోకి తెచ్చారు.
ఫ జిల్లాలో 352కు పెరిగిన ఎంపీటీసీలు
ఫ ఎంపీటీసీ స్థానాల పునర్విభజనపై అభ్యంతరాలు స్వీకరణ
ఫ 12న తుది జాబితా ప్రకటన