
మూడేళ్లుగా.. ఫీజులివ్వలే!
నల్లగొండ : పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బెస్ట్ అవైలబుల్ స్కీం(బీఏఎస్) లక్ష్యం నీరుగారుతోంది. మూడేళ్ల నుంచి ఆ స్కీం కింద నిధులు విడుదల చేయకపోవడంతో రూ.రూ.6,81,58,732 బకాయిలు పేరుకుపోయాయి. దీంతో బెస్ట్ అవైలబుల్ కింద ఎంపికై న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పేద విద్యార్థులకు బుక్స్, నోట్బుక్స్, యూనిఫాం ఇవ్వలేమంటూ చేతులెత్తేస్తున్నాయి. ఫలితంగా విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగాల్సిన పరిస్థితులు దాపురించింది.
జిల్లాలో 12 పాఠశాలలు
బెస్ట్ అవైలబుల్ స్కీం కింద జిల్లాలో 12 ప్రైవేట్ పాఠశాలలు విద్యనందిస్తున్నాయి. వీటిలో 5 నుంచి 10వ తరగతి వరకు 1,325 మంది విద్యార్థులకు చదువుకుంటున్నారు. ప్రభుత్వం డే స్కాలర్ కింద ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి రూ.28 వేలు, రెసిడెన్షియల్ విద్యార్థులకు రూ.42 వేలు చెల్లిస్తుంది. విద్యార్థులకు యూనిఫాం, నోట్బుక్స్, పాఠ్యపుస్తకాలు, షూ కూడా సదరు పాఠశాలలే ఇవ్వాలి. ప్రతి విద్యా సంవత్సరం మధ్యలో ప్రభుత్వం పాఠశాలలకు నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ మూడేళ్లుగా నిధులు విడుదల చేయడం లేదు. దీంతో ఆయా ప్రైవేట్ పాఠశాలలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. యూనిఫాం, నోట్బుక్స్, షూ ఇవ్వలేమని వాటిని పిల్లలే తెచ్చుకోవాలని చెబుతున్నాయి.
ధర్నాకు దిగిన తల్లిదండ్రులు
బెస్ట్ అవైలబుల్ కింద ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం మూడేళ్ల నుంచి బకాయిలు చెల్లించకపోవడంతో ఆయా ప్రైవేట్ పాఠశాలలు షూ, యూనిఫాం, నోట్బుక్స్ విషయంలో తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులు సోమవారం గ్రీవెన్స్ సందర్భంగా కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. నేటికీ నిధుల విడుదల విషయంలో స్పష్టత లేకుండా పోయిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఫ బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు
నిధులు విడుదల చేయని ప్రభుత్వం
ఫ పాఠ్యపుస్తకాలు, యూనిఫాం ఇవ్వలేమంటున్న ప్రైవేట్ పాఠశాలలు
ఫ ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు
బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు 12
చదివే విద్యార్థులు 1,325
డే స్కాలర్కు
ఏడాదికి చెల్లించేది రూ.28 వేలు
రెసిడెన్షియల్కు రూ.42 వేలు
2022–23లో బకాయి రూ. 70,70,852
2023–24లో రూ.2,91,67,880
2024–25లో రూ.3,19,20,000
మొత్తం బిల్లులు రూ.6,81,58,732
బిల్లులు ట్రెజరీకు పంపాం
బెస్ట్ అవైలబుల్ స్కీంకు సంబంధించి ఆయా ప్రైవేట్ పాఠశాలలకు చెల్లించాల్సిన బిల్లులను ట్రెజరీకి పంపాం. రాష్ట్రస్థాయిలో ఇవి పెండింగ్లో ఉన్నాయి. బిల్లులు త్వరలోనే విడుదలవుతాయి. తల్లిదండ్రులు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం ఈ విషయంపై వినతిపత్రాలు ఇచ్చారు. వాటిని పైఅధికారులకు పంపుతాం.
– శశికళ, ఎస్సీ అభివృద్ధిశాఖ డీడీ, నల్లగొండ

మూడేళ్లుగా.. ఫీజులివ్వలే!