
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు 144 మంది హాజరు
నల్లగొండ: జిల్లాలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. బుధవారం ఉదయం ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు పరీక్షలు జరిగాయి. మొదటి సంవత్సరం పరీక్షకు 136 మంది విద్యార్థులకు 106 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన ఇంటర్ సెకండియర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మ్యాథ్స్ పరీక్షలకు 56 మంది హాజరు కావాల్సి ఉండగా 38 మంది విద్యార్థులు హాజరయ్యారు.
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే క్రిమినల్ కేసులు
నల్లగొండ టౌన్: లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఫలితాలు వెల్లడించే కేంద్రాలపై వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అడ్వయిజరీ సలహా మండలి నిబంధనల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ పుట్ల శ్రీనివాస్ హెచ్చరించారు. బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జరిగినజిల్లా అడ్వయిజరీ సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి లింగ నిర్ధారణ పరీక్షలు చేసే కేంద్రాలపై దాడులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో స్కానింగ్ చేసే గర్భిణుల పూర్తి వివరాలు ఫార్మాట్ రూపంలో వైద్య ఆరోగ్య శాఖకు అందించాలని సూచించారు. జిల్లా కేంద్రంలో పలు స్కానింగ్ సెంటర్లలో అర్హత లేని రేడియాలజిస్టులు, గుర్తింపు పొందిన సంస్థలు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అలాంటి వాటిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ సమావేశంలో ఎంసీహెచ్ ప్రాజెక్టు ఆఫీసర్ డాక్టర్లు అరుంధతి, స్వరూపారాణి, సుచరిత, వందన, గీత, కళ్యాణచక్రవర్తి, రవి, కృష్ణకుమారి, నర్సయ్య, రమేష్ పాల్గొన్నారు.
ఎస్టీ గురుకులాల్లో బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి దరఖాస్తులు
నల్లగొండ: జిల్లాలోని గిరిజన గురుకుల పాఠశాలల్లో బ్యాక్లాగ్ సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్టీ గురుకులాల ప్రాంతీయ సమన్వయ అధికారి బలరాం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని త్రిపురారం మినీ గురుకులంలో 1వ తరగతిలో 30, 2లో 14, 3లో 6, 4లో 4, 5 వ తరగతిలో 10 బ్యాక్లాగ్ సీట్లు, పెద్దవూర గురుకులంలో 1వ తరగతిలో 30, 2లో 18, 3లో 9, 4లో 8, 5లో 5సీట్లు, చందంపేటలో 1లో 30, 2లో 1, 5లో 11సీట్లు ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సీట్ల భర్తీ కోసం గిరిజన విద్యార్థులు జూన్ 6లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్
నిర్మాణానికి స్థల పరిశీలన
నాగార్జునసాగర్: సాగర్ నియోజకవర్గానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి నందికొండ మున్సిపాలిటీలో బుధవారం మి ర్యాలగూడ సబ్కలెక్టర్ నారాయణ్ అమిత్ స్థల పరిశీలన చేశారు. హిల్కాలనీ బీసీ గురుకుల పాఠశాల వెనక భాగంలో నాట్కో ట్రస్టు క్వా ర్టర్ల పక్కన స్కూల్ నిర్మాణానికి అనువైన స్థలా న్ని పరిశీలించారు. అనంతరం మాజీ మంత్రి జానారెడ్డి నివాసంలో అధికారులతో సమావేశమయ్యారు. ఆయనవెంట ప్రాజెక్టు ఇన్చార్జ్ మల్లికార్జునరావు, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఆర్ఐ దండ శ్రీనివాస్రెడ్డి, ఫారెస్టు అధికారులు రాఘవేందర్రావు, రమేష్ ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
నల్లగొండ: కేంద్రప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీఓ శేఖర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాని సురక్ష బీమా పథకం కింద ఖాతాదారుడు ఏడాదికి రూ.20 చెల్లిస్తే రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని పేర్కొన్నారు. 18 నుంచి 70 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలని తెలిపారు. జీవన జ్యోతి బీమా పథకం కింద ఖాతాదారుడు సంవత్సరానికి రూ.436 చెల్లిస్తే రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని, 18 నుంచి 50 ఏళ్ల వయస్సు కలిగి ఉండాని పేర్కొన్నారు.