
గిరిజనులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
హాలియా : గిరిజనులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్నాయక్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర గిరిజన సంఘం(టీఆర్జీఎస్) ఆధ్వర్యంలో పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో నిర్వహించిన విద్యా, వైజ్ఞానిక రాజకీయ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతుల్లో ఆదివారం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి తీసుకొచ్చి గిరిజన రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతోందన్నారు. అందులో భాగంగా తిరుమలగిరి(సాగర్) మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఫారెస్టు భూములకు పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల భూ సమస్యలను పరిష్కరిస్తుందని గుర్తు చేశారు. గిరిజనులను ఐక్యమత్యంతో గిరిజన నాయకులు ముందుకు నడిపించి హక్కుల సాధన కోసం పోరాడాలన్నారు. ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి మాట్లాడుతూ గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, తండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా గుర్తించాలనే న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. టీఆర్జేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్ర శంకర్నాయక్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గిరిజన సంఘం సీనియర్ నాయకులు రమావత్ శంకర్నాయక్, బుడియాబాబు పీఠాధిపతి ఆంగోతు భగవాన్నాయక్, టీఆర్జీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ధీరావత్ రవినాయక్, రిటైర్డ్ డీటీడీఓ లాల్సింగ్, రమావత్ లలితాబాయి, రమావత్ జవహర్నాయక్, వెంకన్న, చంద్రుడునాయక్, రాగ్యానాయక్, నరేష్నాయక్, శ్రీనునాయక్, సురేష్, భాస్కర్నాయక్, అశోక్నాయక్ తదితరులు పాల్గొన్నారు.