
పోలీస్ గ్రీవెన్స్లో వినతుల స్వీకరణ
నల్లగొండ: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ శరత్చంద్ర పవార్ 45 మంది నుంచి వినతులు స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి, సంబంధిత ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి చట్టపరంగా బాధితులకు న్యాయం జరిగేవిధంగా చూడాలని ఆదేశించారు.
స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్గా నారాయణ అమిత్
నల్లగొండ: స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్గా నారాయణ అమిత్కు బాధ్యతలు అప్పగిస్తూ సోమవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నారాయణ అమిత్కు కలెక్టర్ బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కాగా సెలవుపై వెళ్లి తిరిగి వచ్చిన రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ సోమవారం విధుల్లో చేరారు.
వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి
నల్లగొండ అగ్రికల్చర్: వ్యవసాయ రంగ అభివృద్ధికి బ్యాంకులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం ఇండోనేషియాలోని బాలిలో బ్యాంక్ ఆఫ్ ఇండోనేషియా, రీజనల్ పాలసీ ఫోరం 78వ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. సహకార బ్యాంకుల ద్వారా వ్యవసాయ రంగానికి ఇస్తున్న రుణాలు, అభివృద్ధి తదితర అంశాలను సదస్సులో వివరించారు. వ్యవసాయ రంగంలో వేస్టేజీ, పొల్యూషన్ లేకుండా వనరులు వాడుకునే విధానం, ఇండోనేషియాలో వ్యవసాయ రంగంలో జరుగుతున్న అభివృద్ధి విధానాలను తెలుసుకోవడం కోసం క్షేత్ర పర్యటనలో ఆయన పర్యటించారు. ఈ సదస్సులో అన్ని జిల్లాల సహకార బ్యాంకుల చైర్మన్లు, వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
క్షయ రహిత జిల్లాగా మార్చాలి
నల్లగొండ టౌన్: జిల్లాలో క్షయ వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు కృషిచేసి క్షయ రహిత జిల్లాగా మార్చాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అన్నారు. సోమవారం నల్లగొండ పట్టణంలోని మాన్యంచెల్క అర్బన్ హెల్త్ సెంటర్లో జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. మందుల ద్వారా క్షయ వ్యాధి పూర్తిగా నయమవుతుందని, వ్యాధి లక్షణాలు ఉన్న వారు వెంటనే జిల్లా కేంద్రంలోని టీబీ ఆస్పత్రిలో సంప్రదించి పరీక్షలు చేయించుకుని కోర్సు ప్రకారం మందులు వాడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి డాక్టర్ కళ్యాణచక్రవర్తి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ వేణుగోపాల్రెడ్డి, మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

పోలీస్ గ్రీవెన్స్లో వినతుల స్వీకరణ

పోలీస్ గ్రీవెన్స్లో వినతుల స్వీకరణ

పోలీస్ గ్రీవెన్స్లో వినతుల స్వీకరణ