
ప్రతిపాదనలు పకడ్బందీగా ఉండాలి
దేవరకొండ : దేవరకొండ నియోజకవర్గంలో దర్తి ఆబ ఆవాస్ యోజన పథకానికి సంబంధించి ప్రతిపాదనలు పకడ్బందీగా ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శనివారం దేవరకొండ ఎంపీడీఓ కార్యాలయంలో దర్తీ ఆబ జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ పథకంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పథకానికి నియోజకవర్గంలో 29 గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపిక చేసిన గ్రామాల్లో సివిల్ పనులపై ఎక్కువగా దృష్టి పెడతామని, పనులు శాశ్వతంగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతిపాదిత పనులకు ఈనెల 13లోగా ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. ముఖ్యంగా తాగునీరు, అంగన్వాడీ, పంచాయతీరాజ్, వైద్యం, విద్య, గ్రామీణాభివృద్ధి ద్వారా పనులు చేపట్టాలన్నారు. ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ తండాల్లో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ రాజ్కుమార్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చత్రునాయక్, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, ఆర్డీఓ రమణారెడ్డి, పంచాయితీరాజ్ ఎస్ఈ రామచంద్రారెడ్డి, ఎంపీడీఓ డానియల్, సుచరిత, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి