
ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీ వద్ద ఉద్రిక్తత
మోటకొండూర్: మోటకొండూర్ మండలం కాటేపల్లి గ్రామంలోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీలో మంగళవారం సాయంత్రం రియాక్టర్ పేలి ముగ్గురు మృతిచెందగా.. ఆరుగురికి తీవ్రంగా గాయపడ్డారు. తమకు న్యాయం చేయాలని మృతులు, గాయపడిన వారి కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో బుధవారం ఉదయం పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. కాటేపల్లి ప్రధాన రోడ్డు పక్కన టెంట్ వేసుకుని ఆందోళనకు దిగారు. నాలుగు గంటల పాటు మోత్కూరు–రాయిగిరి రోడ్డును దిగ్భందించారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. బాధిత కుటుంబాలను భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి వేర్వేరుగా వచ్చి పరామర్శించారు. తగిన న్యాయం చేయటానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కంపెనీలో పేలుడు సంభవించిన స్థలాన్ని పరిశీలించారు.
మృతులకు రూ.కోటి నష్టపరిహారం..
ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీ యాజమాన్యంతో భువనగిరిలోని ఓ హోటల్లో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూర్ అశోక్, పలువురు నాయకులు చర్చలు జరిపారు. దీంతో పరిశ్రమ యాజమాన్యం మృతుల కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.కోటి నష్టపరిహారంతో పాటు వారి కుటుంబంలో ఒకరికి కంపెనీలో పర్మినెంట్ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. తక్షణ సహాయంగా రూ.50లక్షలు, మిగతా రూ.50లక్షలు తర్వాత చెల్లిస్తామని ఒప్పుకున్నారు. గాయపడిన వారికి తక్షణ సహాయం కింద రూ.5లక్షల ఆర్థిక సాయంతో పాటు ఆస్పత్రి ఖర్చులు భరిస్తామని, తిరిగి వారు పనిలో చేరేవరకు పూర్తి జీతం, అంగవైక్యం సంభవిస్తే తగిన న్యాయం చేస్తామని ఒప్పుకున్నారు. దీంతో ఆందోళన విరమించారు.
రెండు మృతదేహాల వెలికితీత..
రియాక్టర్ పేలుడు ధాటికి మాంసం ముద్దలుగా మారి శిథిలాల కింద చిక్కుకున్న మోటకొండూర్ మండల కేంద్రానికి చెందిన చెన్నోజి దేవిచరణ్, కాటేపల్లి గ్రామానికి చెందిన గునుగుంట్ల సందీప్ మృతదేహాలను బుధవారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో పోలీసులు వెలికితీసి భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. సందీప్ తల్లి మంగమ్మ ఫిర్యాదు మేరకు కంపెనీ డైరెక్టర్ దుర్గాప్రసాద్, ప్రొడక్షన్ మేనేజర్ శ్రీకాంత్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగుల ఉపేందర్ తెలిపారు.
న్యాయం చేయాలని బాధితుల
కుటుంబ సభ్యుల ఆందోళన
మృతుల కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.కోటి ఇస్తామని యాజమాన్యం హామీ
క్షతగాత్రులకు రూ.5లక్షల
ఆర్థికసాయం
నరేష్ అంత్యక్రియలు పూర్తి
ఆత్మకూరు(ఎం): ఈ ఘటనలో మృతిచెందిన ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెందిన కల్వల నరేష్(32) అంత్యక్రియలను మండల కేంద్రంలో బుధవారం నిర్వహించారు. స్థానికులు పెద్ద సంఖ్యలో అంత్యక్రియల్లో పాల్గొన్నారు. నరేష్ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అంత్యక్రియలో పలువురు నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీ వద్ద ఉద్రిక్తత