నల్లగొండ : లక్ష్యాన్ని సాధించేందుకు విద్యార్థులు కష్టపడి చదవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. సోమవారం కలెక్టరేట్ ఉదయాదిత్య భవన్లో సాంఘిక సంక్షేమ హాస్టళ్ల పదో తరగతి విద్యార్థులకు ఏర్పాటుచేసిన ప్రేరణ తరగతులకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పదో తరగతి పరీక్షలను సవాల్గా తీసుకొని రాయాలన్నారు. పరీక్షల సమయంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని, స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ రెండింటిని చేయాలని సూచించారు. పరీక్షల్లో 10/10 జీపీఏ సాధించి జిల్లాకు మంచి పేరు తేవాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ ఇన్చార్జి డిప్యూటీ డైరెక్టర్ కోటేశ్వరరావు పాల్గొన్నారు.