వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం

Jun 3 2023 1:48 AM | Updated on Jun 3 2023 1:48 AM

సత్యనారాయణ రెడ్డి (ఫైల్‌)
 - Sakshi

సత్యనారాయణ రెడ్డి (ఫైల్‌)

పెద్దవూర: బైక్‌ను కారు ఢీకొట్టడంతో వ్యక్తి మృతిచెందిన ఘటన శుక్రవారం పెద్దవూర మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవూర మండలంలోని చలకుర్తి గ్రామానికి చెందిన మాసిన సత్యనారాయణరెడ్డి(33) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం తన బైక్‌పై పెద్దఅడిశర్లపల్లికి వెళ్లి పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా పెద్దవూర మండల కేంద్రంలోని వ్యవసాయ సబ్‌ మార్కెట్‌ సమీపంలో హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ వద్దకు రాగానే మల్లేపల్లి వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి బైక్‌ను ఎదురుగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై సత్యనారాయణరెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు అవివాహితుడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగార్జునసాగర్‌లోని కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పచ్చిపాల పరమేష్‌ తెలిపారు.

బైక్‌ అదుపుతప్పి.. డివైడర్‌ను ఢీకొట్టి..

కట్టంగూర్‌: మండలంలోని పామనగుండ్ల గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రామన్నపేట మండలం శోభనాద్రిపురం గ్రామానికి చెందిన ఎస్‌. సయ్యద్‌(26) తన తల్లితో కలిసి బైక్‌పై స్వగ్రామం నుంచి కట్టంగూర్‌కు బయల్దేరాడు. మార్గమధ్యలో పామనగుండ్ల గ్రామ సమీపంలోని పెట్రోల్‌ బంక్‌ వద్దకు రాగానే బైక్‌ అదుపు తప్పడంతో డివైడర్‌ను ఢీకొట్టాడు. దీంతో సయ్యద్‌ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసలు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని నకిరేకల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదంపై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఎలాంటి ఫిర్యాదు అందలేదు.

బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు..

ఆలేరురూరల్‌: ఆలేరు బైపాస్‌ రోడ్డులో వోల్వో బస్సు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఆలేరు ఎస్సై వెంకటశ్రీను తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు బైపాస్‌ రోడ్డులోని మాడీస్‌ రెస్టారెంట్‌ సమీపంలో శుక్రవారం తెల్ల వారుజామున 3 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న వరంగల్‌ డిపోకు చెందిన ఆర్టీసీ వోల్వో బస్సు ఢీకొంది. దీంతో అతడి తల, కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వీఆర్‌ఏ భాస్కర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో ఉంచినట్లు పేర్కొన్నారు.

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement