కొల్లాపూర్: ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కొల్లాపూర్లోని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకుముందు ఆర్డీఓ కార్యాలయం నుంచి మంత్రి క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆశావర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కళావతి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శివవర్మ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆశావర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ. 18వేలు ఇవ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన వేతనాలను రాష్ట్రంలో కూడా అమలు చేయడంతో పాటు ప్రతినెలా ఒకటో తేదీనే ఆశావర్కర్లకు వేతనం అందించాలన్నారు. అదే విధంగా పెండింగ్లో ఉన్న పీఆర్సీ ఏరియర్స్ చెల్లించాలని, పరీక్షల డ్యూటీలకు అదనపు పారితోషికం నిర్ణయించాలని, ప్రమాదవశాత్తు మరణిస్తే బీమా సౌకర్యం, రిటైర్డ్ బెనిఫిట్స్ కల్పించాలని కోరారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంత్రి క్యాంపు కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో నాయకులు పెబ్బేటి శంకర్, సలీం, బత్తిని రాజు, చెన్నమ్మ, శివలీల, సుజాత, విజయలక్ష్మి, జ్యోతి, శారద, వెంకటమ్మ, వరలక్ష్మి, జయమ్మ, ఆదిలక్ష్మి పాల్గొన్నారు.


