● ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెంచేలా పనిచేయాలి
● కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
కందనూలు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించరాదని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. జిల్లా జనరల్ ఆస్పత్రితో పాటు వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు అందుతున్న వైద్యసేవలపై శనివారం కలెక్టరేట్ వీసీ హాల్లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల లభ్యత, వైద్యసిబ్బంది హాజరు, అత్యవసర సేవలు, ప్రసూతి, పరీక్షలు, పారిశుద్ధ్యం పరిస్థితులపై కలెక్టర్ ఆరా తీశారు. ఆస్పత్రులకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మెరుగైన సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో సేవలు సమర్థవంతంగా అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందించే ఆరోగ్య సేవల్లో నిర్లక్ష్యం వహించొద్దన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా వైద్యసిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. ఆస్పత్రుల్లో అవసరమైన మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రతి రోగికి మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వీసీలో జిల్లా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి, డీఎంహెచ్ఓ రవినాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఓటరు జాబితాలో తప్పులు లేకుండా చర్యలు..
ఓటరు జాబితాలో తప్పులకు తావివ్వకుండా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. ఓటరు మ్యాపింగ్ ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి నిర్వహించిన వీసీలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు 75 శాతం మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఓటరు జాబితా పరిశీలన, బూత్ల వారీగా వివరాల సేకరణ, సిబ్బంది సమన్వయం వంటి అంశాల్లో ప్రత్యేక దృష్టిసారించినట్లు వివరించారు. వీసీలో ఆర్డీఓలు సురేశ్బాబు, యాదగిరి, బన్సీలాల్, రవికుమార్ పాల్గొన్నారు.


