నాగర్కర్నూల్ క్రైం: ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డితో కలిసి స్థానిక ప్రభుత్వ మెడికల్ కళాశాల వద్ద జనరల్ ఆస్పత్రి భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు అత్యాధునిక వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఆస్పత్రి నిర్మాణంతో వైద్యరంగం మరింత అభివృద్ధి చెందుతుందని.. పేదలు హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని అన్నారు. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించే జనరల్ ఆస్పత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి రావడంతో పాటు మెడికల్ విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్చైర్మన్ బాదం రమేశ్, కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.ఉషారాణి పాల్గొన్నారు.


