నాగర్కర్నూల్ క్రైం: పోలీసు ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఎస్పీ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. భూ తగాదాలపై 10, తగున్యాయం కోసం 5 ఫిర్యాదులు అందాయని.. సంబంధిత అధికారులు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు.
విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంచాలి
పెద్దకొత్తపల్లి: ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ.. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంచాలని డీఈఓ రమేశ్కుమార్ అన్నారు. సోమవారం మండలంలోని వావిళ్లబావి, బాచారం ప్రాథమిక, కల్వకోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో డీఈఓ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులతో పాటు మధ్యాహ్న భోజనం, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు. విద్యార్థుల అభ్యసన స్థాయికి అనుగుణంగా బోధనా పద్ధతులు కొనసాగించాలని సూచించారు. ప్రతి విద్యార్థికి మెరుగైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే ఉపాధ్యాయులపై చర్యలు తప్పవన్నారు. డీఈఓ వెంట జిల్లా బాలికా విద్య కోఆర్డినేటర్ శోభారాణి, జిల్లా టెస్టుబుక్స్ మేనేజర్ నర్సింహులు ఉన్నారు.
ఆర్టీసీ అభివృద్ధికి కష్టపడి పనిచేయాలి
స్టేషన్ మహబూబ్నగర్: ఆర్టీసీ సంస్థ అభివృద్ధి కోసం ఉద్యోగులు కష్టపడి పనిచేయాలని డిప్యూటీ రీజినల్ మేనేజర్ లక్ష్మిధర్మ అన్నారు. జిల్లాకేంద్రంలోని డిపోలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లకు సోమవారం త్రైమాసిక అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను మిగతా వారు స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఆర్టీసీలో ప్రమాదాల శాతాన్ని తగ్గించాలని సూచించారు. ఆర్టీసీ టూర్ ప్యాకేజీలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, మీ అనుకూలమైన సమయాల్లో వీటి గురించి గ్రామాల్లో, కాలనీల్లో ప్రచారం చేయాలని కోరారు. టూర్ ప్యాకేజీల వల్ల అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో టూటౌన్ సీఐ ఎజాజుద్దీన్, డిపో మేనేజర్ సుజాత, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
175 ఎంబీబీఎస్ సీట్లకు ఎన్ఎంసీ అనుమతి
పాలమూరు: మహబూబ్నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎంబీబీఎస్లో ప్రవేశాల కోసం 175 సీట్లు మంజూరు చేస్తూ ఎన్ఎంసీ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో కళాశాలలో పర్యటించిన ఎన్ఎంసీ బృందం.. పలు లోపాలు ఉన్నట్లు నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధిత అధికారులు లోపాలపై ఇచ్చిన నివేదికపై సంతృప్తి చెందిన ఎన్ఎంసీ.. సీట్లు జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం కళాశాలలో ఉన్న సమస్యలను రాబోయే నాలుగు నెలల వ్యవధిలో పరిష్కరించుకోవాలని ఎన్ఎంసీ ఆదేశించింది.

పోలీసు ప్రజావాణికి 15 అర్జీలు